– రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం 11 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో పామాయిల్ సాగు చేస్తున్న దేశాలు ఇండోనేసియా, మలేసియా. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చి ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని చెప్పారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంట నూనెల దిగుమతి వలన పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈఓ బృహత్తర కార్యాచరణను అమలు చేస్తేందని మంత్రి చెప్పారు.
అంతర్జాతీయ ధరలలో వచ్చే హెచ్చు తగ్గుదల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు.