• వాటిలో 8వేల 161 కి.మీల రోడ్లకు తక్షణ మరమ్మత్తులు అవసరం
– దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు
• రూ.2153 కోట్లతో 5731 రాష్ట్ర,జిల్లా ప్రధాన రోడ్లకు ప్రత్యేక మరమ్మత్తులకు చర్యలు
• సిఆర్ఐఫ్ కింద రూ.1959 కోట్లతో 1605 కి.మీల పొడవున 115 పనుల పురోగతి
• 2014-19 సం.లో ఆర్అండ్బికి 14,970 కోట్లు కేటాయిస్తే 12,064 కోట్లు ఖర్చు చేశాం
• గత ప్రభుత్వం 2019-24లో 19,428 కోట్లు కేటాయించి 9,015 కోట్లే ఖర్చు చేశారు.
– రాష్ట్ర రోడ్లు భవనాలు,ఐ అండ్ ఐ శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి
అమరావతి,26 జూన్:రాష్ట్రంలో దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారులకు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు నిర్వహించి గుంతలు లేని రోడ్లుగా చేయడమే తక్షణ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు,పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బిసి జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు .ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశ్వీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో ఆర్ అండ్ బి శాఖకు బడ్జెట్లో రూ.14 వేల 970 కోట్ల రూపాయలు కేటాయిస్తే రూ.12 వేల 64 కోట్లు అనగా 80 శాతం ఖర్చు చేసి రోడ్లను బాగు చేయడం జరిగిందన్నారు.అదే గత ప్రభుత్వ హయాం 2019-24లో ఆర్ అండ్ బి కి రూ.19వేల 428 కోట్లు బడ్జెట్ ల్లో నిధులు కేటాయించి కేవలం రూ.9 వేల 15 కోట్లు అనగా 46శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
అంతేగాక గత ప్రభుత్వంలో జరిగిన రూ.2 వేల 261 కోట్లకు బిల్లులు చెల్లించ లేదని దానివల్ల పనులు చేసినా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రస్తుతం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మంత్రి జనార్థన రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 8164 కి.మీల జాతీయ రహదార్లు,12,653 కి.మీల రాష్ట్ర రహదార్లు, 27,062 కి.మీల ముఖ్య జిల్లా రహదార్లు,5663 గ్రామీణ రహదార్లు కలిపి మొత్తం 53వేల 542 కి.మీల రహదార్లు ఉండగా వాటిలో 45,378 కి.మీలు రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. గత ఐదేళ్ళలో తగినన్నినిధులు మంజూరు చేయని కారణంగా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడం గుంతలు పూడ్చడం జరగలేదని అన్నారు.
రహదారుల ప్రాధాన్యాన్ని బట్టి ప్రతి 5 సంవత్సరములకు ఒక్కసారి రోడ్లకు ఒక లేయరు తారుతో ప్రత్యేక మరమత్తుల క్రింద చేయడం జరగాల్సి ఉందని గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయని కారణంగా సుమారుగా 22,007 కిలోమీటర్లు రోడ్లకు ప్రత్యేక మరమత్తులు చేయవలసి ఉందని పేర్కొన్నారు.ప్రస్తుతం దాదాపు 9080 కిలోమీటర్ల రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని తక్షణం 8161 కిలోమీటర్లు ప్రధాన జిల్లా రహదార్లు,3340 కిలోమీటర్ల రాష్ట్ర రహదార్లు ప్రత్యేక మరమత్తులకై ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేపట్టి రోడ్లలో గుంతలు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.జిల్లా అధికారులు నుండి గుంతలను పూడ్చుటకు మరియు అత్యవసర మరమత్తు లకు రూ. 284 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని మంజూరుకు పరిశీలన చేస్తున్నట్టు మంత్రి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో న్యూడెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ధిక సహాయంతో రూ.6400 కోట్లతో 2 ప్రాజెక్టులు మంజూరు కాగా దానిలో 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు 30% రాష్ట్ర ప్రభుత్వ వాటా.రూ.3014 కోట్లతో మొదటి ఫేజ్ క్రింద 13 ప్యాకేజీల్లో పనులు జరుగుతుండగా ఇప్పటి వరకూ రూ.510 కోట్ల పనులు జరిగాయని మంత్రి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.గత ప్రభుత్వం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన అడ్వాన్స్ రుణమును సకాలంలో కాంట్రాక్టర్లకు చెల్లించక పోవడంతో పనులు మందకొడిగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
అదే విధంగా సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సి ఆర్ ఐ ఎఫ్) స్కీం క్రింద 1959 కోట్ల రూపాయల వ్యయంతో 1605కి.మీ.ల పొడవుతో 115 పనులు జరుగుతుండగా ఇప్పటికే రూ 428 కోట్ల తో 350 కి.మీ.ల.పొడవున 39 పనులు పూర్తి కాగా 1255 కి.మీ. పొడవున రూ 1531 కోట్లతో 76 పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
2023-24లో CRIF పనుల చెల్లింపునకుగాను కేంద్ర ప్రభుత్వం రూ 483 కోట్లు విడుదల చేస్తే వాటిలో కేవలం రూ 253 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం CRIF పనులకు చెల్లించి సుమారు రూ 230 కోట్లు గుత్తేదార్లకు చెల్లించకుండా ప్రక్కదారి పట్టించడం జరిగిందని మంత్రి జనార్ధన్ రెడ్డి వివరించారు.
సేతు బంధన్ పధకం కింద పది ఆర్వోబిల నిర్మాణానికి 592 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినది.ఇందులో 5 అర్వోబిల నిర్మాణానికి 351 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
ఇతర శాఖలకు సంబందించిన 38 పనులు,24 న్యాయశాఖ భవనాలు రూ. 1079.44 కోట్లతో మంజూరు కాగా వాటిలో 1 ఆఫీసు భవనము,13 డిపోసిట్ పనులు,11 న్యాయశాఖ భవనములు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు.ప్రైమరీ హెల్త్ సెంటర్లు నూతన భవన నిర్మాణము మరియు మరమత్తులకు సంబందించి 1203 పనులు రూ.875.36 కోట్లుకు మంజూరు కాగా 1051 పనులు పూర్తయ్యాయని మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డా.యువ రాజ్,ఆర్ అండ్ బి ఇఎన్సిలు కె.నయీముల్లా,వేణుగోపాల్ రెడ్డి,సిఇలు శ్రీనివాసులు రెడ్డి, రామచంద్ర,వెంకటేశ్వరరావు,సుకన్య, బుచ్చిరాజు,ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.