ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని(ఆగస్టు 6) పురస్కరించుకొని ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టిసారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని ముఖ్యమంత్రి అన్నారు. పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ అని గుర్తు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని, పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని చెప్పారు.
ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవలకు గుర్తింపుగా జూన్ 14వ తేదీన గద్దర్ పేరిట తెలంగాణ ఫిల్మ్ అవార్డులను సినీ కళాకారులకు, సినీ ప్రముఖులకు అందించడం జరిగిందన్నారు. గద్దర్ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.