‘ పొత్తులే’ కాంగ్రెస్ కు జీవగంజి !

– పీకే ప్రతిపాదనలకు ‘చింతన్ శిబిర్ ‘లో ఆమోదం !!

జీవన్మరణ సమస్య నుంచి బయటపడడం ఎలా? అన్న అంశం కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తోంది.దీనిపై రాజస్థాన్ లోని జైపూర్ లో మూడు రోజుల పాటు ‘చింతన్ శిబిర్’ నిర్వహించనున్నది.ఈ హిందీ పదానికి అర్ధం మేధోమథనం.ప్రశాంత్ కిశోర్ చేసిన పలు ప్రతిపాదనలను కాంగ్రెస్ హైకమాండ్ సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది.పీకే ప్రతిపాదనలపై 8 మంది సభ్యులతో కూడిన ప్రియాంక గాంధీ కమిటీ శుక్ర.,శనివారాల్లో ఒక నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సమర్పిస్తుంది.బుధవారం కూడా పీకే కాంగ్రెస్ దిగ్గజాలకు ఆరు గంటలకు పైగా ‘పాఠాలు’ చెప్పారు.

పాఠాలు విన్న వారిలో ప్రియాంక గాంధీ,ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ,దిగ్విజయ్ సింగ్,కేసి.వేణుగోపాల్,రణదీప్ సూర్జేవాలా తదితరులున్నారు.రాజకీయాల్లో తల నెరిసిన నాయకులకు పీకే ‘పెద్ద బాలశిక్ష ‘ అవసరం కావడం ఒక విషాద ఘట్టం. పీకే రూపొందించిన ‘‘మిషన్ 2024’’ ప్రకారం 375 నుంచి 4వందల స్థానాలు నిజంగానే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా? అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్నది.

ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు,ఎన్నికల నిర్వహణతోపాటు,పొత్తులపై నిర్ణయాలు వంటి బాధ్యతలను పీకేకు అప్పగించడానికి సోనియా సుముఖంగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ఎలా తీసుకురావాలి అన్నదానిపై సోనియాగాంధీ పట్టుదలతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ మేథో మథనం సదస్సు మే 13 నుంచి ప్రారంభం కానున్నందున ఆలోగా పీకేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే దిశగా రంగం సిద్ధం అవుతోంది.పీ.కే.సమర్పించిన ‘బ్లూప్రింట్’ పై హైకమాండ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్టు వార్తలందుతున్నవి.

2024 లోక్ సభ ఎన్నికల్లో 370 నుంచి 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించారు.వివిధ రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా పొత్తులు పెట్టుకోవాలని ఆయన సలహా.త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.పీకేకు పార్టీ ప్రధానకార్యదర్శి పదవినిచ్చి ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం,వ్యూహరచన తదితర అంశాలను కేటాయించడానికి సోనియాగాంధీ సుముఖంగా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నవి.

కాంగ్రెస్ పార్టీకి ‘ఆక్సిజన్’ ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నట్టు ఒక ప్రచారం ఉన్నది. సోనియాగాంధీ, రాహుల్ సహా సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా,దిగ్విజయ్ సింగ్ తదితరులతో నాలుగు విడతలుగా ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిగాయి.”కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ చాలా చోట్ల సమర్ధ నాయకత్వం లేని సమస్య ఎదురవుతున్నది. చాలా రాష్ట్రాల్లో పార్టీ గతంతో పోలిస్తే బలహీనపడుతున్నది. అదే సమయంలో విపక్షాలు పుంజుకుంటున్నవి.అలాగే ప్రాంతీయపార్టీలు కూడా బలపడుతున్నవి.ఈ ప్రాంతీయ పార్టీలు తిరిగి బీజేపీతో పోరాడుతున్నవి. ఆయా రాష్ట్రాల్లో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసి ఉన్నద”ని పీ.కే.చెబుతున్నారు.

ఇప్పటిదాకా పీకే ట్రాక్ రికార్డు అంతా గెలిచే వాండ్ల తరపున పని చేయడం. ఆ విజయం తన ఖాతాలో వేసుకోవడంలో అతను దిట్ట. జేడీ(యూ)లో చేరి తన వైఫల్యాన్ని నిరూపించుకున్నాడు. తాను విఫల రాజకీయ నాయకుణ్నని ఆయనే బహిరంగంగానే ప్రకటించారు. అలాంటి ‘రాజకీయ పిల్లకాకి’ని నమ్ముకుంటోందంటే ఆ పార్టీ దుస్థితిపై సహజంగానే సానుభూతి కలుగుతుంది. ‘‘2024 స్ట్రాటజీ’’ ప్రజెంటేషన్ ఆరంభంలోనే పీకే….“You cannot play politics just around the elections. If you want to survive in this politics, you have to speak the same language, operate within the same framework that the BJP works in”.అన్నారు.
‘‘కేవలం ఎన్నికలే కేంద్రంగా రాజకీయ ప్రాంగణాన్ని పుక్కిటపట్టలేం. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే…ప్రత్యర్థి వాడే పరిభాషను గుర్తించి దాన్నే అస్త్రంగా సంధించాలి. బీజేపీ అనుసరిస్తున్న చట్రం గుట్టును పసిగట్టి అలాంటి చట్రాన్నే ఆశ్రయించాలి’’.అని పీకే చెప్పారు. The absence of a continuous Opposition narrative over the last five years helped the BJP. Structurally too, both the Congress and BSP are virtually non-existent. So UP suddenly became a two-party contest in which the SP appeared inadequate to take on the BJP.-యూపీలో ఐదేళ్ల కాలం పాటు ప్రతిపక్షాల నిర్లిప్తత కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం సరిగ్గా జరగలేదు.అది బీజేపీకి అనుకూలించింది. బీఎస్పీ-కాంగ్రెస్ లు దాదాపు ఉనికిలో లేకుండా పోయాయి. దీంతో యూపీ రాజకీయ మైదానం రెండు పార్టీలకు కేంద్రంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ బీజేపీని సవాలు చేసే స్థితిలో లేకుండా పోయింది” అన్నది ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ.

‘‘in the 1970s when RSS chief BalasahebDeoras aligned the organisation with politics on the one hand and expanded its caste base on the other. Govindacharya and “social engineering” came much later but it was Deoras who started the internal transformation of the RSS outlook. Besides, the Jana Sangh merged with the Janata Party experiment in the 1970s and the Right became a part of the mainstream. The second shift came in the 1990s when BJP leaders Atal Bihari Vajpayee and Pramod Mahajan mooted the idea of a coalition to exercise power. So, this became an important aspect of the BJP’s politics with its leaders saying they would keep aside their core agenda and go along with concerns of coalition partners.
‘1970లో నాటి ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ ఆర్ఎస్ఎస్ ను రాజకీయాలతో సమన్వయం చేశారు.మరోవైపు సామాజిక వర్గాల ప్రాధాన్యతను గుర్తించి అటువైపు దృష్టిసారించారు. ఆ తర్వాత కాలంలో గోవిందాచార్య ‘‘సోషల్ ఇంజనీరింగ్’’ ప్రాధాన్యతను గుర్తించారు. ఆర్ఎస్ఎస్ దృక్కోణం అలా పరివర్తన పొందింది. ఆ తర్వాత కాలంలో జన్ సంఘ్ జనతా పార్టీలో విలీనమైంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రెండో దశ మార్పు తొంభయ్యో దశకంలో వాజ్ పేయి, ప్రమోద్ మహాజన్ ల ఆధ్వర్యంలో మొదలైంది. కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను, అనివార్యతను గుర్తించి అధికారంవైపు అడుగులు వేసింది. తాత్కాలికంగా బీజేపీ తన మౌలిక సిద్ధాంతాలను కూటమి రాజకీయాలకోసం పక్కనబెట్టింది.’’

‘‘Ramjanambhoomi Andolan, That was the inflection point at which public opinion shifted. The middle ground changed in the 2002-2004 period and, therefore, it became possible for Modi to cultivate this changed public opinion in a very skillful manner over the last 10 years. This shift hasn’t happened overnight; there has been history of three decades.’’
‘రామజన్మభూమి ఉద్యమం..ప్రజాభిప్రాయాన్ని గుణాత్మకంగా మార్చివేసింది. ఆ తర్వాత 2002-04 మధ్యకాలంగా తీసుకుంటే…దశాబ్ద కాలంలో నరేంద్ర మోదీ అత్యంత నైపుణ్యవంతంగా ప్రజాభిప్రాయాన్ని మార్చేశారు. ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. సుమారు మూడు దశాబ్దాల చరిత్ర ఉంది’’.అని పీకే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, తనపట్ల తీవ్రమైన వ్యతిరేకత కనపరుస్తున్న ప్రాంతీయ పార్టీలతో సైతం పొత్తులు పెట్టుకోవడం వల్ల మాత్రమే తిరిగి అధికారాన్ని సాధిస్తుందని పీకే అంచనా.

గుజరాత్ ఎన్నికల్లో ప్రభావశీల పాటిదార్ నేత నరేష్ పటేల్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ఆయన సూచించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, కొత్త కమిటీలు వేయాలన్నది మరో సూచన. 2023 ఫిబ్రవరిలో జరగ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మే లో కర్ణాటక, నవంబర్ లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, డిసెంబర్ లో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల విషయంలో సైతం పీకే స్థూలంగా ఒక బ్లూ ప్రింట్ ను కాంగ్రెస్ నాయకత్వానికి అందించారు.

ఏపీ,బెంగాల్,తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, మమత బెనర్జీ, కేసీఆర్ లతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విభేదాలు సమసిపోయేలా తాను చొరవ తీసుకుంటానని కూడా పీకే హామీ ఇచ్చారు.ఈ రాష్ట్రాల్లో అధికారం ప్రాంతీయ పార్టీలదే అయినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమనేది ముఖ్యమని పీకే అంటున్నారు. వివరించినట్టూ సమాచారం. 2023లో జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పీకే వ్యూహం గ్రౌండ్ అయ్యే అవకాశముందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.

కాగా గాంధీ కుటుంబంపై గుర్రుగా ఉన్న ‘జి-23’ నాయకులు పీకే రాకను వ్యతిరేకిస్తున్నారు. వెనక్కి వెడితే 1998లో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు మధ్యప్రదేశ్, ఒడిషా, మిజోరంలలో మాత్రమే అధికారంలో ఉన్నది.తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ వచ్చింది. 2004లో కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.ప్రస్తుతం పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్లలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది.ఎనిమిదేండ్లుగా బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి ‘విరుగుడు’కనిపెట్టడంలో ఈ పురాతన పార్టీ విఫలమవుతున్నది.

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ పేరిట బీజేపీ పకడ్బందీగా రాజకీయ ‘క్రీడ’ నడుపుతున్నది.ఈ క్రీడ కాంగ్రెస్ కు అంతు చిక్కడం లేదు.కాంగ్రెస్ కు మునుపెన్నడూ అనుభవంలో లేని ‘వికృత క్రీడ’ ఇది ! ప్రధానమంత్రిగా మోడీ గుజరాత్ నుంచి తన స్థావరాన్ని ఢిల్లీకి మార్చిన అనంతరం ఆయన మొత్తం బీజేపీని వశపరచుకున్నారు.హిందుత్వవాదం మూలాలున్న బీజేపీలో ‘వ్యక్తి పూజ ‘ అరుదైన సన్నివేశం.ప్రవీణ్ తొగాడియా వంటి కరడుగట్టిన హిందుత్వ వాదులను కూడా పక్కన పెట్టగలగడం మోడీకే సాధ్యమైంది.పార్టీలో తనకు పోటీదారులు లేకుండా,అసమ్మతివాదులు లేకుండా చేసుకోవడంలో ఆయన విజయం సాధించడంతో తిరుగులేని నాయకునిగా అవతరించారు.

ఇటు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మారాలని ఎన్ని డిమాండ్లు వస్తున్నా, గాంధీ కుటుంబ సభ్యులకు మించిన నాయకులు కనపడకపోవడం ఒక విషాదం. రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ పూర్తిగా దెబ్బతింటున్నట్టు తెలిసినా రాహుల్ స్థానంలో ప్రత్యామ్నాయం కనపడడం లేదు.కాంగ్రెస్ పునరుద్ధరణ కాంగ్రెస్కు మాత్రమే ముఖ్యం కాదు, మొత్తం ప్రజాస్వామ్యానికి, మన సమాజానికి కూడా ఎంతో ముఖ్యమని సోనియాగాంధీ తమ పార్టీ పార్లమెంటుసభ్యులతో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరికి ఏ రకమైన అభిప్రాయం ఉన్నా ఆ పార్టీ లౌకికపార్టీ అని అందరూ నమ్ముతారు.దేశంలో ఇప్పుడు నెలకొని మతోన్మాద పరిస్థితుల నుంచి కాంగ్రెస్ మాత్రమే ప్రజల్ని రక్షించగలదన్న విశ్వాసమూ ప్రజలకు ఉన్నది.తమకు నచ్చని,తమతో ఏకీభవించని వ్యక్తులు,సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్లా అణచివేస్తున్నదో చూస్తున్నాం.చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 16 మంది కవులు,రచయితలు,న్యాయవాదులు,మేధావులు మూడేండ్లుగా జైళ్లలో మగ్గుతున్నారు.

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వీరంతా ‘అర్బన్ మావోయిస్టుల’ని,ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర చేశారని అభియోగాలు నమోదు చేశారు.ఈ కేసులలో మెరిట్స్ ఎట్లా ఉన్నా’ధిక్కార స్వరాల’ను పూర్తిగా అణచివేయాలన్నది అమిత్ షా,మోడీ వ్యూహం. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో ఎంత భ్రష్టుపట్టినా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశాలు చాలా తక్కువ.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను కాంగ్రెస్ కనీసం అనుమతిస్తుంది.ఈ దేశానికి మావోయిస్టులే అత్యంత ప్రమాదకరం అని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినా,మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలకు నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం పునాదులు వేసినా బీజేపీ ‘అణచివేత పద్ధతుల’కు కాంగ్రెస్ విధానాలు భిన్నమైనవి.

కాగా గుజరాత్,రాజస్థాన్,హిమాచల్ ప్రదేశ్,కర్ణాటక,మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ మధ్యనే ఉంటుంది.తెలంగాణలో టిఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ వాతావరణం ఉన్నది.కాంగ్రెస్ ను ఓవర్ టేక్ చేసి టిఆర్ఎస్ తో బీజేపీ తలపడే అవకాశాలు స్వల్పం.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ,టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ.అక్కడ బీజేపీ,జనసేన తెలుగుదేశం పార్టీకి
‘తోక పార్టీలు’గా మనగలగవలసిందే.

ఈ తొమ్మిది,పది రాష్ట్రాలలో కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలన్నది బిజెపి సంకల్పం.ఆ తర్వాత ప్రాంతీయపార్టీల ‘సంగతి’ చూడవచ్చునని మోడీ, అమిత్ షా అనుకుంటున్నారు.ఎన్నికల ప్రచారం, క్రింది స్థాయి నుంచి పోలింగ్ బూత్ ల నిర్వహణ, ప్రత్యర్థులను బలహీనపరచడం, అవసరమైన చోట్ల, 80% – 20% వంటి హిందూత్వ విధానాలు,భావోద్రేకాలతో మోదీ అనుసరిస్తున్న వ్యూహరచన విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఇక బీజేపీకి దీటుగా మరో రాజకీయపార్టీ ఉండదు.

ప్రాంతీయ పార్టీలు కేంద్రప్రభుత్వం నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆత్మరక్షణ పద్ధతులను అనుసరించవలసిన పరిస్థితులు ఇప్పటికే నెలకొన్నవి.కేసీఆర్,మమతా బెనర్జీ,స్టాలిన్,ఉద్ధవ్ థాకరే వంటి వారు కొంత మినహాయింపు.2023,2024 ఎన్నికల్లో వచ్చే రాష్ట్రాలను చేజిక్కించుకొని అధికారాన్ని,బిజెపితో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించడం కాంగ్రెస్ పార్టీకి అంత సులభం కాదు.

కాంగ్రెస్ లో చింత చచ్చినా పులుపు చావని నాయకులున్నారు.అందువల్ల క్రమశిక్షణా రాహిత్యం కనిపిస్తున్నది.క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణ,కర్ణాటక నాయకులతో జరిపిన ప్రత్యేక సమావేశాల్లో తేల్చి చెప్పారు.”జనంలోకి వెళ్లి ఉద్యమాలు చేయండి.మీరు ఎప్పుడు రమ్మన్నా నేను వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటా” రాహుల్ గాంధీ అన్నారు.ఇదివరకే ఆయన ఈ పని ఎందుకు చేయలేదో ఎవరికీ అర్థం తెలియదు.ప్రాప్తకాలజ్ఞత అంటే ఇదే! క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వేటు వేస్తామని సోనియాగాంధీ హెచ్చరించారు.క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉల్లఘించినందువల్లనే అరాచక పార్టీగా కాంగ్రెస్ అప్రతిష్టపాలయ్యింది.

పంజాబ్ లో ముఖ్యమంత్రిని అమరీందర్ సింగ్ ను దూషించిన నవజోత్ సింగ్ సిద్ధూను ప్రోత్సహించి పిసిసి పగ్గాలను అప్పగించింది. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో అసమ్మతి కార్యకలాపాలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సహించినది. అసమ్మతి నాయకులను ముఖ్యమంత్రులను చేసిన ‘క్రెడిట్’ కాంగ్రెస్ కు దక్కుతుంది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అసమ్మతి సమస్యలు ఉన్నవి. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అసమ్మతి నడిపిన వారే రేవంత్ రెడ్డికి తలనొప్పిగా తయారయ్యారు.అసమ్మతి కార్యకలాపాలు నడిపే నాయకుల వెనుక రహస్య ఎజెండా ఉంటుందన్నది బహిరంగ రహస్యం. తాము అసమ్మతి నడపడం వల్ల, పార్టీ హైకమాండ్ నియమించిన నాయకుడ్నే బలహీనపరచడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. రాహుల్, ప్రియాంకలను విమర్శించిన తమిళనాడులో పార్టీ అధికార ప్రతినిధిపై వేటు వేశారు.మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే విధమైన ‘కఠినవైఖరి’ని అవలంబించాలని సోనియాగాంధీ భావిస్తున్నారు.

వరంగల్ లో మే 6 న తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’ ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా ఏమిటో రుజువుచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ సభతో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అందుకే ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీతో సభను నిర్వహిస్తున్నది.జన సమీకరణకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఐదు లక్షల మందిని సమీకరించే ప్రణాళికలను రచించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే జగ్గారెడ్డి,భట్టి తదితరుల బృందం గురు,శుక్రవారాల్లో జనసమీకరణ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు.ఈ నెల 23 న విస్తృతస్థాయి సమావేశం తలపెట్టారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తున్నది. రాహుల్ సభను విజయవంతం చేయడానికి జట్టుగా ప్రయత్నాలు చేస్తుండడం కాంగ్రెస్ క్యాడర్ కు ఉపశమనం కలిగించే సన్నివేశమే.

– ఎస్.కె. జకీర్
ఎడిటర్, బంకర్‌న్యూస్

Leave a Reply