– అయిదేళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడు.
– దమ్ముంటే అయిదేళ్ళ వైసీపీ పాలనపై విచారణ జరిపించండి
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్
విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. వైసీపీ పాలన ఓ విపత్తు అయితే.. అయిదేళ్ళలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా? అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా? రాజధాని లేని రాష్ట్రంగా అయిదేళ్ళు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? అని దుయ్యబట్టారు.
ఇంకా, ఆమె ఏమన్నారంటే… ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్టు అనిపించలేదా? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా? అయిదేళ్ళపాటు జగన్ మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా అయిదేళ్ళు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని మొసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు.
2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ. 3 లక్షల కోట్లు ఇస్తాం.. పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం. అమిత్ షా ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మీ వ్యాఖ్యలు మీద మీరు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత అయిదేళ్ళ వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి.