ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించేందుకు  ఉత్తర్వులు జారీ చేసింది.  సామాజిక భద్రత కల్పనా చర్యగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువస్థాయి హోదాతో నియామకం జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విషయాన్నే ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం వల్ల ఆలస్యమైందని ప్రభుత్వం తెలిపింది.  త్వరితగతిన ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు గానూ గ్రామవార్డు సచివాలయాల్లోని ఖాళీల్లో మృతి చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులను కారుణ్య నియామకం కింద భర్తీ చేయాలని నిర్ణయించింది.  అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తులు పరిశీలించి తక్షణం గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వారితో భర్తీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు  సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply