– న్యాకో తాజా నివేదికలో 7వ స్థానానికి చేరిన రాష్ట్రం
– సిబ్బందికి మంత్రి సత్యకుమార్ అభినందన
అమరావతి: దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ( APSACS) పనితీరు బాగా మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరుకుందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ తాజా పనితీరు సూచీలో వెల్లడించింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును కనబర్చడం ద్వారా 17వ ర్యాంక్ నుండి పైకి ఎగబాకింది. ఈ కాలంలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ కృషిని న్యాకో అభినందించింది. న్యాకో విడుదల చేసిన సూచీలో… వివిధ ప్రమాణాల విషయంలో ఎపిశాక్స్ సాధించిన ఫలితాల్ని న్యాకో వెల్లడించింది.
ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (టిఐ) మరియు లింక్ వర్కర్స్ స్కీం (ఎల్ డబ్ల్యుఎస్) విషయంలో 100 శాతం ఫలితాల్ని సాధించిందని న్యాకో పేర్కొంది. టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ కింద ఎపి శాక్స్ రాష్ట్రవ్యాప్తంగా 96 ఎన్జీవోల ద్వారా మహిళా సెక్స్ వర్కర్స్ (ఎఫ్ఎస్ డబ్ల్యు) వంటి అధిక ప్రమాదకర వ్యక్తుల సమూహాల్ని స్క్రీనింగ్ చేసిందని తెలిపింది. ఎయిడ్స్ ప్రభావిత వ్యక్తులను, వారికున్న పరిచయాలను గుర్తించడంతో పాటు ఎల్ డబ్ల్యుఎస్ కింద ప్రతి జిల్లాలో 100 హై రిస్క్ గ్రామాలను గుర్తించి, ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి మరియు మరింత వ్యాప్తి చెందకుండా ట్రాక్ చేయడానికి కృషి చేసిందని న్యాకో వెల్లడించింది.
హైరిస్క్ గ్రూపులలో 96 శాతం మందికి ఎయిడ్స్ స్క్రీనింగ్ చేసి, తదుపరి చికిత్స చేపట్టారని న్యాకో తెలిపింది. ఈ గ్రూపులలో 75 శాతం మంది గర్భిణిలను పరీక్షించడంతో పాటు, హై రిస్క్ గ్రూపులలో 88 శాతం మందికి సిఫిలిస్ కోసం పరీక్షలు నిర్వహించినట్లు కూడా న్యాకో వివరించింది. గతేడాది ఏప్రిల్ డిసెంబర్ మధ్యకాలంలో ఎపి శాక్స్ 90 శాతం నిధులను ఉపయోగించుకుందని, ఇది పనితీరు ర్యాంకింగ్ను మెరుగుపర్చుకోవడానికి వీలు కల్పించిందని తెలిపింది. ర్యాంకుల కేటాయింపులో ఎయిడ్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని కూడా న్యాకో పరిగణనలోకి తీసుకుంది. ఖైదీల స్క్రీనింగ్ను మెరుగుపరచడంపై ఎపి శాక్స్ ఇప్పుడు దృష్టి సారించింది.
2004 నుండి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,25,000 మంది ఎయిడ్స్ బాధితుల్ని గుర్తించారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం 2024-25 సంవత్సరానికి గాను ఎపి శాక్స్ కు రూ.127 కోట్లు న్యాకో ఇచ్చింది. లక్ష్యాలకనుగుణుంగా ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడంలో మంచి పని తీరు కనబర్చినందుకు ఏపీ శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరిని, సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు