అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ ..దేశంలోనే మొదటి స్థానం

– టీడీపీ మచిలీపట్టణం పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత

అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవటం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యమని టీడీపీ మచిలీపట్టణం పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో వెలుగు చూసిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన బాధితులను టీడీపీ మహిళా బృందం పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చల్లపల్లి సీఐ బీ.భీమేశ్వర రవికుమార్ ను కలిసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. స్వర్ణలత మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి మహిళ అని చెప్పే ఈ వైసీపీ ప్రభుత్వంలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడట్లేదన్నారు.

చట్టబద్దత లేని దిశా చట్టం పేరుతో హడావుడి చేసే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మహిళా సంరక్షణలో విఫలమైందన్నారు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు పాలడుగు వినీల, మైనేని ఇందిరా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అఘాయిత్యాలు అరికట్టే వరకు టీడీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయ రాధిక, మచిలీపట్టణం పార్లమెంటరీ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply