Suryaa.co.in

Telangana

జోగులాంబ సన్నిధిలో హిందుత్వం పై దాడి

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం ఫ్లెక్సీ చించివేత
వినాయక మండపాలపై కాషాయం జెండాల తొలగించి, చించివేత
ప్రధాని మోడీ గారి ఫ్లెక్సీలు చించినా స్పందించని పోలీసులు
“ఏం పీక్కుంటారో.. పీక్కోండి..” అంటూ దుండగుల బలితెగింపు
కేసు పెట్టమంటే.. మాట్లాడుకోండి అంటూ సర్ది చెప్పే ప్రయత్నం
నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనకు సిద్ధమన్న విశ్వహిందూ పరిషత్

అలంపూర్ జోగులాంబ సన్నిధిలో హిందుత్వం పై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి సాక్షిగా హిందుత్వంపై విషం చిమ్ముతున్నారు దుండగులు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కట్టిన బ్యానర్ ను కొంతమంది ముస్లిం యువకులు పనిగట్టుకుని చించి వేశారు. అంతటితో ఆగలేదు.. 17వ తేదీ రాత్రి వేళలో వినాయక మండపం దగ్గర ఏర్పాటు చేసిన కాషాయ జెండాలను కూడా తొలగించారు. అలంపూర్ పట్టణంలోని అగోర పేట కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

అయితే ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి.. వినాయక నిర్వాహకులు ముస్లిం యువకులకు ఫోన్ చేశారు. ఎందుకు ఈ విధంగా చించివేశారో మాట్లాడుకుందాం రండి అని సదరు ముస్లిం యువకులను, హిందూ యువకులు పిలిచారు. దీంతో రెచ్చిపోయిన ముస్లిం యువకులు “ఏం పీక్కుంటారో పీక్కోండి.. మేం రాము” అంటూ తెగేసి చెప్పారు. దీంతో వినాయక నిర్వాహకులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

కానీ పోలీసులు ఏమాత్రం చొరవ చూపడం లేదు. “మీరు .. మీరు కూర్చొని మాట్లాడుకోండి” అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వినాయక మండపాల దగ్గర జెండాలు చించిన యువకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. కానీ వారిని పోలీసులు వెనకేసుకు రావడం విశేషం.

ఇదే విషయమై విశ్వహిందూ పరిషత్ పెద్దలు అలంపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడదామంటే ఫోన్ లో స్పందించలేదు. అంతేకాదు.. గతంలో కూడా అలంపూర్ టెంపుల్ లో జరిగిన సీనియర్ అసిస్టెంట్ రంగనాథ్ విషయంలో కూడా అలంపూర్ పోలీసులు నిందితునికి మద్దతు పలకడం గమనార్హం. అప్పుడు పెట్టిన కేసు ఇంకా నమోదు చేయకపోవడం అలంపూర్ పోలీసుల ఘనత.!

హిందువులు పరమ పవిత్రంగా పూజించే వినాయక నవరాత్రి ఉత్సవాలపై ముస్లిం యువకులు దాడి చేయడం హేయమైన చర్య అని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు డిమాండ్ చేశారు.
ఈ విషయంలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని.. లేదంటే ఆందోళనకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. నిందితులను వెనకేసుకు రావాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నించారు.

LEAVE A RESPONSE