– అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులూ ఆత్మవిమర్శ చేసుకోవాలి
– కోర్టుల హెచ్చరికల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
– అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి
– హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీనియర్ నేత, మాజీ మంత్రి సాకె శైలజానాథ్
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, నియంత పాలన ఆపేసి రాజ్యాంగ బద్దంగా పని చేయాలని మాజీ మంత్రి సాకె శైలజానాథ స్పష్టం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సాకె శైలజానాథ్ చురకలంటించారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వం ముఖం మీద సుత్తితో కొట్టినట్టుగా ఉంది. రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపులకు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టులాంటిది.
ప్రభుత్వం సుప్రీం తీర్పుతోనైనా బుద్ధితెచ్చుకుంటే మంచిది. కొమ్మినేని అరెస్ట్ విషయంలో కనీసం తెలంగాణ పోలీసులను కూడా సంప్రదించలేదని సమాచారం. అందుకే అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఒక నిమిషం ఆలోచించి తమ విధులను, చట్టాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
70 ఏళ్ల వయసుపైబడి ఉన్న వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సబబేనా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అరెస్టుకు ముందు తన భార్యతో మాట్లాడటానికి కూడా కొమ్మినేనిని పోలీసులు అనుమతించలేదు. ఆయనతో మాట్లాడటానికి లాయర్లను కూడా వెళ్లనీయలేదు. కొమ్మినేని మీద వ్యక్తిగత కక్షతోనే ఇదంతా చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షిలో కొమ్మినేని నిజాలు మాట్లాడిస్తుంటే చంద్రబాబు భయపడిపోతున్నాడు.
అందుకే ఆయనపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయించారు. అధికారం చేతిలో ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే భ్రమల్లో నుంచి ఇకనైనా బయటకు రావాలి. అంతిమంగా న్యాయమే విజయం సాధిస్తుందని, నిజమే గెలుస్తుందని చెప్పడానికి కొమ్మినేని కేసు ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
రాష్ట్రంలో నవ్వకూడదనే ఆంక్షలున్నాయా?:
కొమ్మినేని అరెస్ట్ అంశాన్ని కూడా చంద్రబాబు అత్యంత జుగుప్సాకంగా మాట్లాడి హేళన చేశాడు. డిబేట్కు వచ్చిన గెస్ట్ మాట్లాడిన విషయాలను హోస్ట్కి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? పైగా నవ్వాడనే కారణంతో 70 ఏళ్ల వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సమర్థించడం లేదు. ‘కేసు విచారణ సందర్భంగా తమకు కూడా నవ్వొస్తుందని.. అలా అని తమపైనా కేసు పెడతారా’? అని సుప్రీంకోర్డు న్యాయమూర్తులు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో నవ్వడంపై కూడా నిషేధం ఉందేమో చంద్రబాబు చెప్పాలి.
సూపర్ సిక్స్ అమలు చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. పైగా సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వారికి నాలుక మందం అంటున్నాడు. నిట్టనిలువుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకే నాలుక మందం. అబద్ధాలు, మోసాలతోనే ఏడాది పాలన పూర్తయింది. చంద్రబాబుకి అమరావతి తప్ప వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ కనిపించడం లేదు.