– అర్హమైన అన్నింటికి సానుకూల పరిష్కారం
– భూభారతి పోర్టల్ లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తి
– రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రతి దరఖాస్తుపై సరైన విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్ గా భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను ఎందుకు తిరస్కరించవలసి వచ్చిందో అనే వివరాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు అందించాలని ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని ఇందులో 8,27,230 దరఖాస్తులు వచ్చాయని ఇప్పటి వరకు 7,98,528 దరఖాస్తులను డేటా ఫార్మేట్ లో భూభారతి పోర్టల్ లో నమోదు చేయడం జరిగిందన్నారు. మిగిలినవాటిని కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోభూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టం ద్వారా దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దశల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. సర్వే నెంబర్లలో లోపాలు పిపిబి, ఆర్వోఆర్, నాలా, ఆర్ .ఎస్ .ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టుకేసులు, పోడుభూములు తదితర 30 రకాల భూ సమస్యలపై 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ధరణి పోర్టల్ మూలంగా తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొన్నసమస్యలు కళ్లకుకట్టినట్లు కనబడుతున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన స్వార్ద పూరితమైన ఆర్వోఆర్ చట్టం 2020 వల్ల ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రజానీకానికి భూభారతి చట్టం ద్వారా విముక్తి కల్పిస్తామని ప్రకటించారు. కింది నుంచి పై స్ధాయి వరకు మొత్తం రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక ఎజెండాగా తీసుకొని సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రైతుల సంతోషమే ధ్యేయంగా పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, అంకితభావంతో సానుకూల దృక్పధంతో ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు.