– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగు నీటి రంగాన్ని కాంగ్రెస్ సంక్షోభం లోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు పోక, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన రాక తెలంగాణ సాగు నీటి రంగం సంక్షోభంలోకి వెళ్తున్నది. తెలంగాణ నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్ ది అయితే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్ రెడ్డిది. ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలు.. ఖమ్మం: పెద్దవాగు కొట్టుకుపోయింది, నల్లగొండ: సుంకిశాల కుప్ప కూలింది. పాలమూరు: వట్టెం పంప్ హౌజ్ జలమయమైంది. నల్గొండ: ఎస్ ఎల్ బి సి కుప్ప కూలింది. జోగులాంబ గద్వాల్: జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయాయి. సంగారెడ్డి: మంజీర డ్యాం ఆప్రాన్ వరద దాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్ లలో పగుళ్లు వచ్చాయి.
పాలన వైఫల్యం, కాంగ్రెస్ చేతగాని తనం వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయి. ఇవేవి ఎన్డీఎస్ఏకు కనిపించవు, వినిపించవు. మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిన కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలు ఎందుకు కనిపించడం లేదు? రేవంత్ రెడ్డి! ఇప్పటికైనా కళ్లు తెరువు. తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని నీ రాజకీయ అజెండాలకు బలి చేయకు. మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి, ఇకనైనా ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టు. తెలంగాణ ప్రజలు నీ రోత మాటలతో పాటు, నీ చేతగాని తనాన్ని గమనిస్తున్నారు.