Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ది కేడీలు, బేడీల పాలన

– రేవంత్ రెడ్డి విశ్వవిఖ్యాత బూతుల రత్న
– గోబెల్స్ ప్రచారంలో నోబెల్ బహుమతి ఇవ్వాలి
– కాంగ్రెస్ ది గోల్డెన్ పీరియడ్ కాదు, ఎమర్జెన్సీ పీరియడ్
– చంద్రబాబు కండ్ల లో ఆనందం చూడాలనే రేవంత్ విద్రోహ పాలన
– అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సమాధి కట్టి తెలంగాణను ఎండబెట్టే కుట్ర
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానిది గోల్డెన్ పీరియడ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడాన్ని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 50 ఏళ్ల నాటి చీకటి ఎమర్జెన్సీ పీరియడ్ ను తలపింప జేస్తోందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు పంగనామాలు, 420 హామీల ఎగనామా లు పెట్టి ప్రజలను నిలువునా ముంచిన దగాకోరు పార్టీ కాంగ్రెస్ అని జీవన్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ సర్కారు నయవంచనను ప్రశ్నించే వారిపై బూటకపు కేసులు, అక్రమ నిర్బంధాలు అమలు చేస్తూ నాటి నిరంకుశ ఎమర్జెన్సీ రోజులను జ్ఞప్తికి తెస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ది కేడీలు, బేడీల పాలనగా ఆయన అభివర్ణించారు.

రేవంత్ రెడ్డి విశ్వవిఖ్యాత బూతుల రత్న అని, గోబెల్స్ ప్రచారం చేయడంలో ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని తిట్టందే రేవంత్ కు పూట కూడా గడవ దన్నారు. రైతు పండుగ పేరుతో అసలు రైతులే లేని ఒక దండగమారి సభలో కేసీఆర్ పదేళ్ల పాలనపై రేవంత్ రెడ్డి విషం కక్కారని, కేసీఆర్, కేటీఆర్ లను దూషించారని, తెలంగాణ ప్రాజెక్టుల ను అవమానించా రని ఆయన మండిపడ్డారు.

కాళేశ్వరం దేశానికే అన్నం పెట్టే పరమేశ్వరం అన్నారు. తన గురువు చంద్రబాబు కండ్లలో ఆనందం చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి తెలంగాణ విద్రోహ పాలన సాగిస్తున్నా రని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సమాధి కట్టి తెలంగాణను ఎండబెట్టే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఏం ఒరగబెట్టారని రైతు విజయోత్సవ సభలు జరుపుతు న్నారని ఆయన నిలదీశారు. రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసాకు తూట్లు పొడవడం, పంట బోనస్ ఎగ్గొట్టడం వంటి చర్యలతో నిత్యం అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుండడం కాంగ్రెస్ కు పండగా? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణకు స్వర్ణ యుగమంటే కేసీఆర్ పదేళ్ల పాలన అను ఆయన స్పష్టం చేశారు. రాతి యుగమంటే కాంగ్రెస్ కటిక చీకటి పాలన అని ఆయన అన్నారు.కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE