తెలంగాణలో మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు షురూ అయ్యాయి. ఒమిక్రాన్కేసులు తేలిన నేపథ్యంలో హైదరాబాద్లోని టోలీచౌక్ మొత్తం ఒకే క్లస్టర్గా నిర్బంధం చేశారు.కేసులు నమోదైన పారమౌంట్ కాలనీని పోలీసులు, వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్కు కూడా శాంపిల్స్ పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఇక నుంచి విదేశాల నుంచి వచ్చినోళ్లలో ఒక్కరికి పాజిటివ్ తేలినా, ఆ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ చేసి టెస్టులు చేయనున్నారు.
మొదటి, రెండో వేవ్ లో చేసినట్లే ఈ ప్రక్రియ ఉండనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానం మళ్లీ అమల్లోకి రానుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో కేసులు పెరిగినా క్లస్టర్లుగా విభజించిన సదరు కాలనీల్లో ప్రతి రోజు హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది , మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్సిబ్బందిలు ఆ ఏరియాను పర్యవేక్షణ చేయనున్నారు.
కంటైన్మెంట్ లో ఉన్న వ్యక్తి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువులను జీహెచ్ఎంసీ సిబ్బంది అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 వారాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యశాఖ నొక్కి చెప్పింది.
కంటైన్మెంట్లు విధించడం వలన వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చు. వైరస్ చైన్ లింక్ ను తొలగించే ప్రక్రియనే ఈ క్లస్టర్విధానం . ఈ పరిధిలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని కలిసే అవకాశం లేనందున వైరస్కేవలం కంటైన్మెంట్కే పరిమితం అవుతుంది. ఇంక్యూబేషన్ పీరియడ్ తర్వాత పూర్తిస్థాయి అదుపులోకి వస్తుంది. తద్వారా కేసుల తీవ్రతను సులువుగా అడ్డుకోవచ్చని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మొదటి, రెండో వేవ్లలో వైరస్ వ్యాప్తిని ఈ విధానంతోనే అడ్డుకున్నట్లు అధికారులు చెప్పారు. అసలు దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ ప్రక్రియను మన రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మొదటి వేవ్ సమయంలో మర్కజ్ వ్యక్తులను గాలింపు చర్యల్లో కరీంనగర్లో మొదటి సారి కంటైన్మెంట్ చేశారు. ఆ తర్వాత కేసులు ఎక్కువగా ఉన్న ప్రతి ప్రాంతంలో ఈ ప్రక్రియను తీసుకువచ్చారు.

Leave a Reply