-ఓదార్చాల్సింది పోయి కేసులు పెడతారా?
– రేవంత్కు మానవత్వం లేదా?
– వరుస మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలే
– గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం
– ఎక్స్ వేదికగా రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరికి కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయింది. అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే మరో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం.
కళ్లముందు విగతజీవిగా పడి ఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గం. రోజురోజుకూ ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా, కనికరం కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ సర్కారు తీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు.
ఈ దాష్టీకానికి విద్యాశాఖ మంత్రిగా విఫలమై, హోంమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత. కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒక రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం భారత దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. ముఖ్యమంత్రి పూర్తి అసమర్థత వల్ల జరుగుతున్న ఈ వరుస మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలే. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయాలి.
బాలిక మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నందున ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు కనీసం మంచి భోజనం పెట్టడం కూడా చేతకాని ప్రభుత్వం చివరికి వారి ప్రాణాలను కూడా బలితీసుకోవడం సంక్షోభంలో కూరుకుపోయిన విద్యావ్యవస్థకు అద్దం పడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థాంతరంగా రాలిపోతున్న ఈ విద్యాకుసుమాల పాపం ముఖ్యమంత్రికి తగలక మానదు. దయ లేని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.