బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ ..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా అత్యున్నత శిఖరంపై నిలబడిన ఆ మహిళ మళ్లీ ప్రత్యక్షమైంది .నేనింకా ఇక్కడే ఉన్నానంటూ పలకరించింది .ఈసారి ఆమెకుతోడుగా ఓ భారీ విమానంసైతం వెంటపెట్టుకొచ్చింది .భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని చకచకా చూపించేసింది .అసాధారణ సాహసంతో రెండోసారీ కనువిందు చేసిన ఆమె చర్య ఇప్పుడు కూడా సంచలనం రేపుతోంది .

దుబాయ్ వేదికగా జరుగుతోన్న దుబాయ్ ఎక్స్ పో 2020 ని ప్రమోట్ చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ ) సర్కారువారి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ రూపొందించిన తాజా ప్రకటన తాలూకు వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి మరి ..

ఎమిరేట్స్ తాజా ప్రకటనను చూశారా ?
యూఏఈలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ గత వారం విడుదల చేసిన యాడ్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది .ఈ ప్రకటన కోసం నికోల్ స్మిత్ – లుడ్విక్ అనే మహిళ ఎమిరేట్ విమాన సిబ్బంది

కాస్ట్యూమ్ ప్రపంచంలోనే ఎత్తైన భవంతిపైకెక్కి నిలబడింది .ఎమిరేట్స్ ప్రమోషన్ కోసం గతేడాది ఆగస్టులో తొలిసారి నికోల్ బుర్జ్ ఖలీఫా శిఖరంపై నిలబడి ప్రపంచాన్ని షాక్కు గురి చేయగా , ఇప్పుడు దుబాయ్ ఎక్స్ పో 2020 ప్రమోషన్ కోసం మరోసారి ఆ అసాధారణ ఫీట్ కనబర్చింది .

బుర్జ్ ఖలీఫాపై నికోల్ భూమి నుంచి నుంచి 828 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవంతి ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అన్న సంగతి తెలిసిందే . ఆ బిల్డింగ్ శిఖరాగ్రంపై నిలబడి , చెప్పదల్చుకున్న విషయాన్ని ప్లకార్డులు తిరగేస్తూ నికోల్ ఆకట్టుకుంది . గత ఏడాది ప్రకటనలో ఆమె ఒక్కతే భవంతిపై కనిపించగా , ఈసారి భారీ ఏ 380 విమానం కూడా ఆమెకు కంపెనీ ఇచ్చింది . నికోల్ బుర్జ్ ఖలీఫాపై నిలబడి ఉండగా , ఆమె చుట్టూ విమానం చక్కర్లు కొట్టింది . 59 సెకన్ల నిడివి గల ఈ యాడ్ వీడియో నెట్టింట్ వైరలైంది . అంతేకాదు , యాడ్ మేకింగ్ వీడియోను కూడా జనం తెగ చూసేస్తున్నారు .

‘ నేనింకా ఇక్కడే ఉన్నాను . వావ్ .. నాకు దుబాయ్ ఎక్స్ పో కనిపిస్తోంది .ప్రపంచంలోనే అతిగొప్ప ప్రదర్శనను చూసేందుకు ఎమిరేట్స్ విమానం ఎక్కి వచ్చేయండి ఫ్రెండ్స్ .. ‘ అని రాసున్న ప్లకార్డులను

వరుసగా ప్రదర్శించింది నికోల్ . ప్రొఫెషనల్ స్కైడైవింగ్ శిక్షకురాలైన ఈ మహిళతో ఎమిరేట్స్ రూపొందించిన రెండో ప్రకటన కూడా సూపర్ హిట్ అయింది .

కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన దుబాయ్ ఎక్స్ పో 2020 ఎట్టకేలకు గతేడాది ( 2021 ) అక్టోబర్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే . ఈ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ఈ ఏడాది ( 2022 ) మార్చి వరకు కొనసాగనుంది . నికోల్ చేతిలో దుబాయ్ ఎక్స్ పో తేదీలు , అక్కడ కలుద్దామని రాసున్న సందేశాల ఫొటోలను విమానంపై ముద్రించారు . ఎమిరేట్స్ యాడ్ జనవరి 14 న విడుదలలై లక్షల వ్యూస్ లో దూసుకుపోతుండగా , జనవరి 17 న మేకింగ్ వీడియోను సైతం విడుదల చేశారు .

Leave a Reply