రైతులు దోపిడీకి గురికాకుండా కనీస మద్దతు ధర అందేలా చూడాలి

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
-మర్యాదపూర్వకంగా కలిసిన డీఎం శ్రీధర్
గుడివాడ, డిసెంబర్ 15: రైతులు దోపిడీకి గురికాకుండా కనీస మద్దతు ధర అందేలా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని సివిల్ సప్లయిస్ డీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎ శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎం శ్రీధర్ ను మంత్రి కొడాలి నాని అభినందించారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధరను అందించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారని, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఎప్పటికపుడు ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోళ్ళను రోజువారీ సమీక్షిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికపుడు మెరుగుపర్చుకుంటున్నామన్నారు. రైతుల నుండి నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన నిత్యావసరాలను అందించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి కొడాలి నాని ఆదేశించారు.

Leave a Reply