ఆర్ధిక స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని హరిస్తున్న హలాల్ సంస్థలు

– మతం ఆధారంగా సర్టిఫికేషన్ జారీ చేసే మరో ప్రక్రియ హలాల్ సర్టిఫికేషన్
– హిందూ కార్మికుల ఉపాధి అవకాశాలకు గొడ్డలిపెట్టు

మధ్యయుగం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో జిజియా పన్ను గురించి విన్నాం. ఒక హిందువు హిందువుగానే ఉండాలి అంటే రాజ్యానికి పన్ను చెల్లించాలి. ఇప్పుడు హలాల్ సర్టిఫికేషన్ వల్ల, ఇంచుమించు అదే విధమైన ఆర్ధికపరమైన ఆంక్షలు హిందూ వ్యాపార వర్గం ఎదుర్కొంటోంది. హలాల్ సర్టిఫికేషన్ పేరిట జరుగుతున్న మతపరమైన ఆర్థిక దోపిడీ, జిజియా పన్నుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.

‘హలాల్’ సర్టిఫికేషన్ వెనుక కేవలం మతపరమైన నిబంధన మాత్రమే కాకుండా, ఆర్ధిక దృష్టికోణం కూడా ఉంది. 2013వ సంవత్సరంలో మలేషియాలో ‘ప్రపంచ హలాల్ ఉత్పత్తిదారుల ఫోరమ్ సమావేశం’ పేరిట ఒక సదస్సు జరిగింది. అందులో పాల్గొన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)కి చెందిన 57 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు అందరూ కలిసి, “ఇస్లామేతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలు తప్పనిసరిగా ‘హలాల్’ గుర్తింపు కలిగి ఉండాల్సిందే” అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇస్లామేతర దేశాల్లో ఆహార ఉత్పత్తులకు హలాల్ గుర్తింపునిచ్చేవి ఇస్లామిక్ సంస్థలే కాబట్టి , ఈ నిబంధన ఆయా దేశాల్లోని ఇస్లామిక్ సంస్థలకు ఆర్ధికంగా పనికొస్తుంది అనేది దీని వెనుక అసలు ఉద్దేశం.

దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఆహార పరదార్ధాల్లోని స్వచ్ఛతా ప్రమాణాలు, ఆయా పదార్ధాల తయారీలో వాడే వస్తువులపై నిఘా, నియంత్రణ, ఆయా కంపెనీల ఆహార ఉత్పత్తులకు గుర్తింపు జారీ కోసం, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని “ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA”) సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థలు దేశంలోని వివిధ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేయాలనుకునే ఆహార ఉత్పత్తులను జాగ్రత్తగా పరిశీలించి, వాటికి ‘సురక్షిత’ సర్టిఫికేషన్ జారీ చేస్తాయి.

విచిత్రమేమిటంటే సెక్యులర్ దేశమైన భారత్ లో పై రెండు ప్రభుత్వ సంస్థలను కాదని, కేవలం మతం ఆధారంగా సర్టిఫికేషన్ జారీ చేసే మరో ప్రక్రియ కూడా ఉంది. అదే హలాల్ సర్టిఫికేషన్.
ఇస్లామిక్ నిబంధనలను అనుసరించి హలాల్ చేసిన ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు భారతదేశంలో కొన్ని ఇస్లామిక్ మతపరమైన సంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. జమియత్ ఉలేమా-ఇ-హింద్, జమియత్ ఉలేమా-ఇ-మహారాష్ట్ర, మరొకటి హలాల్ సర్టిఫికేషన్ ఇండియా సంస్థలు. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని ప్రయివేట్ సంస్థలు. భారత ప్రభుత్వ సంస్థలైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) లకు ధీటుగా, మతపరమైన హలాల్ సర్టిఫికేషన్ జారీ చేయడం అనేది వీటి ముఖ్య ఉద్దేశం.

హలాల్ సర్టిఫికేషన్
ఆహార పదార్ధాలతో మొదలైన హలాల్ సర్టిఫికేషన్ ఆ తర్వాత ఇతర, ఆహారేతర ఉత్పత్తులకు కూడా వ్యాపించడం మొదలుపెట్టింది. అలంకరణ (మేకప్) సామాగ్రి, సంగీత పరికరాలు వాడకంపై కఠినమైన ఆంక్షలు కలిగిన ఇస్లామిక్ దేశాలు, ఇప్పుడు వాటికి ‘హలాల్ సర్టిఫికేషన్’ ఉంటే మాత్రం తమ దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పటంలేదు. దీని కారణంగా ఇప్పుడు ‘హలాల్ శాఖాహారం’, ‘హలాల చిరుతిళ్ళు’, దగ్గరి నుండి ‘హలాల్ కూల్ డ్రింక్స్’, ‘హలాల్ కాటుక’, ‘హలాల్ టూత్-పేస్ట్’, ‘హలాల్ మేకప్ కిట్లు’, ‘హలాల్ నెయిల్ పాలిష్’ దాకా హలాల్ సర్టిఫికేషన్ విస్తరించింది.

ఇదిలాఉంటే కేరళ రాష్ట్రం కొచ్చిలో వచ్చిన పేపర్ ప్రకటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి ‘షరియా అనుకూల, హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్’ నిర్మాణం తాలూకు ప్రకటన అది. మక్కా దిశను చూసేవిధంగా ‘హలాల్ సర్టిఫైడ్’ ఇంటి ఫ్లాట్ల నిర్మాణం ఇప్పుడు ఊపందుకుంది.

ఈ హలాల్ సర్టిఫికేషన్ కేవలం ఇస్లామిక్ మతపరమైన సంస్థలకు ఆర్ధిక లాభాలు తెచ్చిపెట్టడమే కాదు, ఇది హిందూ కార్మికుల ఉపాధి అవకాశాలకు గొడ్డలిపెట్టు వంటిది. ఈ ఇస్లామిక్ సంస్థలు తమకున్న ‘గుర్తింపు అధికారం’తో ఏమి తినాలి, ఏమి తినవద్దు అని సూచించే స్థాయి నుండి ఇప్పడు ఏకంగా ‘హలాల్ హాస్పిటళ్లు’, ‘హలాల్ టూరిజం’, ‘హలాల్ గృహ సముదాయాలు’.. చెప్పుకుంటూ పొతే ఇలా ఎన్నో!

హలాల్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియలో 3 ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. అవి..
1. హలాల్ చేసే కసాయి మైనారిటీ (వయసు) తీరిన ముస్లిం వ్యక్తి అయివుండాలి
2. హలాల్ చేసే సమయంలో “బిల్స్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్” (దేవుడు పేరిట, అల్లాహ్ మాత్రమే దేవుడు) అని చెప్పాలి. ఇది చెప్పకపోతే ఆ ఆహార పదార్ధాన్ని హలాల్ గా పరిగణించరు.
3. హలాల్ చేస్తున్న సమయంలో వధించబడే జంతువు తల మక్కా దిశగా పెట్టాలి.
పైన పేర్కొన్న 3 ముఖ్య నియమాల్లో ఏది పాటించకపోయినా ఇస్లాం ప్రకారం అది హలాల్ గా పరిగణించరు. ఇక ఆ తర్వాత ఆ జంతువుని ఏవిధంగా వధించాలి, మొదట ఏ భాగంలో ఖండించాలి వంటి ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి.

ఇదంతా గమనిస్తే అర్ధమయ్యే విషయం ఏమిటంటే.. ఒక కంపెనీ తమ ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు కోరుకున్నట్లైతే, ఆ కంపెనీ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా ఇస్లాం మతానికి చెందినవారే అయివుండాలి. ఇతర మతస్థుల శ్రమ ద్వారా జరిగే ఏవిధమైన ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు రాదు. ఇది ఆర్ధిక జిహాద్ తప్ప మరొకటి కాదు. ఇప్పటికే వెనుకబాటుకు గురైన కటిక సామాజిక వర్గానికి చెందిన కార్మికుల ఉపాధిపై హలాల్ సర్టిఫికేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య.

హలాల్ గుర్తింపు కావాలి అంటే ఆయా సంస్థలకు కంపెనీలు సంవత్సరానికి సుమారు 21వేల రూపాయలు దాకా (ఉత్పత్తి చేసే వస్తువు బట్టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెల్లించే డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏ విధంగా వినియోగింపబడుతోందో ఇప్పుడు గమనిద్దాం.

హలాల్ గుర్తింపునిచ్చే సంస్థల్లో ముఖ్యమైన “జమైత్ ఉలేమా-ఇ-హింద్” కార్యకలాపాలు గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా అరెస్ట్ అయ్యే వ్యక్తులకు, ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయం చేసే సంస్థల్లో జమైత్ ఉలేమా ఇ-హింద్ ఎప్పుడూ ముందుంటుంది. పట్టుబడిన ఉగ్రవాది ఎంతటి దేశద్రోహానికి పాల్పడినా, ఎంతటి తీవ్రమైన నేరం చేసినా సరే.. అటువంటి వారికి న్యాయ సహాయం కోసం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరిస్తుంది.

భారతదేశంలో 1919 సంవత్సరంలో “జమైత్ ఉలేమా-ఇ హింద్” సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ దేశవిభజన సమయంలో భారతదేశంలోనే ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుండి ఏర్పడిన మరొక సంస్థ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం తన కార్యకలాపాలు పాకిస్థాన్ కేంద్రంగా సాగిస్తోంది.

పాకిస్థాన్ నుండి శరణార్థులుగా వచ్చే అక్కడి మైనారిటీల కోసం పౌరసత్వ చట్టం సవరణను జమైత్ ఉలేమా-ఇ-హింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాల నిందితులకు న్యాయసహాయం చేసిన ఈ సంస్థ ఉత్తరప్రదేశ్ లోని హిందూ సంస్థ నాయకుడు కమలేశ్ తివారి హత్య కేసు నిందితునికి కూడా ఆర్ధిక సహాయం అందించింది.

ఇలాంటి సంస్థల పట్టు ఎంతగా ఉందంటే గల్ఫ్ దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలనుకుంటున్న పూర్తి స్వదేశీ కంపెనీలు కూడా గత్యంతరం లేక `హలాల్ సర్టిఫికేషన్’ పొందుతున్నాయి. ఆ విధంగా తెలిసితెలిసి చట్ట వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునిస్తున్నాయి.

వివిధ ప్రాంతాల్లో మావోయిస్ట్ లు సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు ఈ హలాల్ కంపెనీలు సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నాయి. మావోయిస్ట్ ల కార్యకలాపాలను నిషేధించి, వాటిని పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో, అలాంటి కఠినమైన చర్యలు ఈ సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న సంస్థల పట్ల కూడా చేపట్టాలి. లేకపోతే దేశ సార్వభౌమాధికారం, ఆర్ధిక స్వాతంత్ర్యం ప్రమాదంలో పడతాయి.
మూలము: విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిలభారత ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు

Leave a Reply