Suryaa.co.in

Telangana

ఉపాథి కార్మికులకూ జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు

– ఉపాధి హామీ కూలీల జీతాలను ఎవరి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు? – ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్

హైదరాబాద్: మహాత్మా గాంధీ పేరుతో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. ఉపాధి కూలీలు సహా, ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఏపీఓలకు, సీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం.

చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి కూలీలు, సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, పస్తులతో కాలం వెల్లదీస్తుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం. మంత్రులకు, అధికారులను కలిసి ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం సోకాల్డ్ ప్రజాపాలన వైఫల్యానికి నిదర్శనం. జీతాల చెల్లింపుల విషయంలో సీఎం, మంత్రులు చెబుతున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదనడానికి ఇది మరో ఉదాహరణ. జీతాలు పెండింగ్‌లో పెట్టి, రొటేషన్‌ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి గారూ.. ఉపాధి హామీ కూలీల జీతాలను ఎవరి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు? ఉపాధి పథకం ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయ హస్తం మేనిఫెస్టోలో చెప్పి ఏడాదిన్నర కావస్తున్నది. అన్ని హామీలు వలె దీనికి దిక్కు లేకుండా పోయింది.

ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి కూలీలు, ఉద్యోగులకు మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

LEAVE A RESPONSE