– కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
– మైనర్ బాలికలపైనా వరుస దాడులు ఆందోళనకరం
– భీమిలిలో మైనర్ బాలికలపై దారుణ అత్యాచారం
– మహిళలపై దాడుల్లో 80 శాతం మద్యం మత్తులో జరిగినవే
– రాష్ట్రంలో 50వేలకు పైగా బెల్ట్షాప్లు నడుస్తున్నాయి
– హోం మంత్రి సొంత జిల్లాలోనే విచ్చలవిడిగా గంజాయి
– సీఎం నివాసం ఉంటున్న జిల్లాలోనే కొకైన్ లభించింది
– ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మహిళల భద్రత ఎలా?
– విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ, వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆమె, హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.
మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్షాప్లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్షాప్లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.
గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్షాపల్ నిర్వాహణ కొనసాగించారు. హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు.
యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు.
ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మద్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి.