Suryaa.co.in

Telangana

నాకు సీమ రొయ్యల పులుసుతో పనిలేదు…తెలంగాణ హక్కులతోనే పని

– నికర జలాల కేటాయింపు ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు?
– మీరు కూడా ముందుకొచ్చి సహకరించాలి కదా ఏపీ సీఎం గారు?
– కిషన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో బాధ్యత తీసుకోరు?
– కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది
– అసలు ఈ రాచపుండు సృష్టించిందే కేసీఆర్
– కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పట్ల కేసీఆర్, హరీష్ మరణశాసనం రాశారు
– రెండురోజులు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడదాం
– ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నీళ్లకు నాగరికతకు ఎంత సంబంధం ఉందో.. నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతే సంబంధం ఉంది. మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా… నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ ఏకాభిప్రాయం ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో కెసీఆర్, హరీష్ సాగునీటి మంత్రులుగా ఉన్నారు. నిర్లక్ష్యమో.., అహంకారమో తెలియదు కానీ… వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయి. రాష్ట్ర విభజన సందర్భంలో నీళ్ల విషయంలో వివాదాలలు తలెత్తుతాయని మన్మోహన్ సింగ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు.

18 జూన్ 2015లో సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి మరణశాసనం రాసి నీటి కేటాయింపులపై కెసీఆర్, హరీష్ సంతకాలు పెట్టి వచ్చారు. కల్వకుర్తి, పాలమూరు, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి నిర్మాణాలను ఆనాటి ప్రభుత్వం పూర్తి చేయలేదు. దీంతో తెలంగాణకు 299 టీఎంసీలను వాడుకోలేకపోయాం.

ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదు. కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పట్ల కేసీఆర్, హరీష్ మరణశాసనం రాశారు.గోదావరి బేసిన్ లో 1486 టీఎంసీలు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు 518 టీఎంసీలు ఆంధ్రాకు కేటాయించారు.

తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసిఆర్ ధనదహంతో రీ ఇంజనీరింగ్ పేరుతో ఊరు పేరు అంచనాలు మార్చారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. బనకచర్లపై కేసీఆర్, హరీష్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

ఇలా అబద్ధాలు చెప్పడం వల్లే ఆ పార్టీ అధికారం కోల్పోయింది. ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది.. ఇప్పుడు అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఇది నదుల పునరుజ్జీవనం కోసం కాదు బీఆరెస్ పునరుజ్జీవనం కోసం వారు మాట్లాడుతున్నారు.అందుకే కేసీఆర్ అండ్ కో… బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తుండ్రు.

3 వేల టీఎంసీలు వరద జలాలు ఉన్నాయని కేసీఆర్ కు ఏ దేవుడు చెప్పిండో కానీ.. చంద్రబాబు దీన్ని అదనుగా తీసుకున్నారు.
అసలు ఈ రాచపుండు సృష్టించిందే కేసీఆర్. చంద్రబాబు ప్రపోజల్ కు కొనసాగింపుగా ఇదే ప్రజా భవన్ లో జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి, కెసిఆర్ గోదావరి జలాలు తీసుకుపొమ్మన్నారు.

మా ఇంటికొస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్ అనే విధానంతో వారు ముందుకెళ్లారు.గోదావరి బేసిన్ లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినతరువాతే మిగులు జలాల లెక్క తేలుతుంది. మిగులు, వరద జలాల లెక్క తేలాలంటే ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలి.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నాకు రాయలసీమ రొయ్యల పులుసుతో పనిలేదు… తెలంగాణ ప్రజల హక్కులతోనే పని. ఇందుకోసం న్యాయమైన విధానంతో ఎక్కడైనా కొట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కృష్ణా బేసిన్ లో మేం కట్టుకునే ప్రాజక్టులకు ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. నికర జలాల కేటాయింపు ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు? మీరు కూడా ముందుకొచ్చి సహకరించాలి కదా ఏపీ సీఎం గారు?
ఇది ఒకవైపు నుంచి వెళితే సమస్య పరిష్కారం కాదు… చర్చలతోనే పరిష్కారమవుతుంది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం లిటిగేషన్లు పెడుతోంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో బాధ్యత తీసుకోరు? ఈ వివాదాన్నిపెంచి బీఆరెస్ పార్టీని బతికించుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటోంది.

వాళ్ల ఆరాటం నీటీ కేటాయింపుల కోసం కాదు.. ఇదొక రాజకీయ వ్యూహం. వ్యూహాత్మక ఎత్తుగడలతో అంతరించి పోతున్న బీఆరెస్ ను పునరుజ్జెవింపజేసేందుకు వీళ్ల ఆరాటం. తద్వారా బీఆరెస్ ను బతికించి రాజకీయ లబ్ది పొందాలన్నదే బీజేపీ వ్యూహం. దీనిపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి.

ప్రజలకు నిజాలు చెప్పకపోతే వాళ్లు చెప్పే అబద్ధాలే నిజమనుకుంటారు. హరీష్ రెండురోజులు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడదాం. ఒక రోజు కృష్ణా బేసిన్ పై, ఇంకో రోజు గోదావరి బేసిన్ పై చర్చ పెడదాం. స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కు లేఖ రాయండి. ఈ రాచపుండును తెలంగాణ ప్రజలకు అంటగట్టింది ఎవరో తెలాల్సిన అవసరం ఉంది

మన శాశ్వతమైన నీటి హక్కులను సాధించుకునేందుకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలి. కెసీఆర్ తో పంచాయతీ కాదు. మన హక్కులను ఎలా సాధించుకోవాలో తెలిపేందుకే ఈ సమావేశం.

మన ఫోకస్ అంతా కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ పై పెట్టాలి. బీజేపీ పరోక్షంగా బీఅరెస్ ను బతికించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందుకు కిషన్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది. కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తోంది

తెలంగాణ ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది. రాష్ట్రాల హక్కులను కాలరాయడానికి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వలేదు. బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణ తీసుకుని ప్రధాని దృష్టికి తీసుకెళ్లండి. ఇందుకు కావాల్సిన సమాచారం మా మంత్రులు అధికారులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

 

LEAVE A RESPONSE