– వరద బాధితులకు కోటిరూపాయలు సాయంచేయడం ఆమె తప్పా?
– నా తల్లిని దూషించినట్టే ..మీ తల్లి, చెల్లి, భార్య, పిల్లలతో ఇలాగే మాట్లాడతారా?
– ప్రభుత్వం, మంగళగిరి ఎమ్మెల్యే కూలగొట్టే ఇళ్లను నేనొచ్చి కట్టిస్తా
– మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
“వరద బాధితులకు మా అమ్మగారు కోటి రూపాయల వరకూ సాయం చేశారు. ఆ సందర్భంలోనూ ఎవ్వరిపైనా విమర్శలు చేయకపోయినా సిగ్గులేకుండా మా అమ్మని విమర్శించారు. మానవత్వం ఉందా? వైసీపీ నేతలు ఇంట్లో తల్లి, భార్య, కూతురు గురించి కూడా ఇలానే మాట్లాడతారా? మనుషులేనా? వళ్లు దగ్గర పెట్టుకోండి.. తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండండి.. ఎక్కుడున్నా ఎవ్వరినీ వదిలిపెట్టను.“ అంటూ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంగళగిరి టౌన్, కురగల్లు,నిడమర్రులలో పర్యటించారు.ఈ సందర్భంగా చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…
“మా అమ్మ వరద బాధితులకు సహాయం అందించడంలో బిజీగా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమెను విమర్శించడంలో బిజీగా ఉన్నారు. గెలిస్తే ఉచితంగా ఇళ్లు ఇస్తామన్న జగన్ రెడ్డి హామీ ఏమైంది? టీడీపీ కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వరు. ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డికి , ఎమ్మెల్యేకి పేదల ఇళ్లు కూలగొట్టే హక్కు ఎవరిచ్చారు?
సీఎం ఇంటి దగ్గర, నియోజకవర్గంలో పేదలకు నివసించే హక్కు లేదా?
ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నవారిని పొమ్మనడానికి మీరెవ్వరు?
మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న వాళ్లు మనుషులా? పశువులా?
సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా ఇలా అన్ని విషయాల్లో జే టర్న్ తీసుకొని మాట మార్చుడు, మడమ తిప్పుడు కి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
జగన బాటలో నడుస్తూ మంగళగిరి ఎమ్మెల్యే కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. ఎన్నికల ముందు జగన్ ని ఒప్పించాను. ఇక్కడే జగన్ ఇళ్లు కట్టుకున్నారు. ఇదే రాజధాని అని చెప్పిన ఆర్కే ఇప్పుడు ఏమంటారు?
అభివృద్ధి చేతగాని ఎమ్మెల్యే చేతలతో గౌతమబుద్ధుడికి ఆగ్రహం…
అభివృద్ధి చేతగాని ఎమ్మెల్యే, తమకు చేతనైన రీతిలో విధ్వంసం చేస్తున్నారని, ఇందులో భాగంగా గౌతమ బుద్దా రోడ్డుని ధ్వంసం చేశారని, ఇది చూస్తే శాంతిస్వరూపుడైన గౌతమ బుద్దుడికి కూడా కోపం వచ్చేలా తీరు ఉందని నారా లోకేష్ విమర్శించారు. ఒక చేతగాని ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గంలో అన్నీ సమస్యలేనన్నారు. ఎటుచూసినా తాగునీరు, పెన్షన్లు కోత , అద్వాన్నంగా ఉన్న రోడ్లు, ఇళ్ల పట్టాలు, పేదల ఇళ్ల కూల్చివేతలేనని లోకేష్ ఆరోపించారు.
మూడు నెలల్లో పూర్తి అవ్వాల్సిన పనులు రెండేళ్లు దగ్గర పడుతున్నా పూర్తి కాలేదన్నారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని ఎమ్మెల్యే , మంగళగిరి నియోజకవర్గానికి 2800 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే అందులోంచి రూపాయి తీసుకురాలేని ఎమ్మెల్యేకి నిరుపేదల ఇళ్లు కూలగొట్టే హక్కులేదన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఆర్కే తన హయాంలో పేదల కోసం కట్టిన ఇళ్లు ఒక్కటైనా చూపించగలరా అని సవాల్ విసిరారు. టిడిపి హయాంలో కట్టిన ఇళ్లకు రంగులేసుకోవడం, టిడిపి పేదలకు కట్టించిన ఇళ్లు కూలగొట్టడం తప్పించి చేసిన అభివృద్ధి పని ఒక్కటీ లేదని ఆరోపించారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదేశాలతో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు పీకేయడం దారుణమన్నారు. గెలిచిన తరువాత పది రోజుల్లో నిడమర్రు రోడ్డులోని డంప్ యార్డ్ తరలిస్తాం అని ఆర్కే ఇచ్చిన ఏమైందని ప్రశ్నించారు. డంప్ యార్డ్ తరలింపు కోసం పోరాడతానని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, నేను గెలిచిన వెంటనే డంప్ యార్డ్ తొలగిస్తానని హామీ ఇచ్చారు.
పరామర్శ-భరోసా…
మంగళగిరి టౌన్లో ఇటీవలకాలంలో మరణించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన నారా లోకేష్, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరంలో వివిధ
వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అవినీతితో అస్తవ్యస్తంగా జరుగుతున్న గౌతమ బుద్దా రోడ్డు నిర్మాణ పనుల గురించి లోకేష్ కి స్థానిక నేతలు వివరించారు. రోడ్డు విస్తరణలో అధికారపార్టీ ఒత్తిడితో తమ ఇష్టానుసారంగా రోడ్డుని ఎలా వంకర్లు తిప్పారో లోకేష్ కి చూపించారు.
తన పింఛను ఆపేశారని దివ్యాంగురాలు ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
13 వ వార్డు లో 40 మంది విద్యార్థులున్న పురపాలక ప్రాథమిక పాఠశాల ఒకే గదిలో కొనసాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు లోకేష్కి వివరించారు.
నిడమర్రు రోడ్డు లోని రైల్వే గేట్ సమీపంలో ఉన్న డంప్ యార్డ్ ని పరిశీలించారు.
కురగల్లు 226 మంది, నిడమర్రులో 105 మంది ఇళ్లని కూల్చేస్తామంటూ అధికారులిచ్చిన నోటీసులతో ఆందోళన చెందుతోన్న బాధితులతో మాట్లాడారు. న్యాయ పోరాటానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
సీఎం జగన్రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇళ్లు పడగొడితే, వాటిని నిలబెట్టే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. అనంతరం కురగల్లు గ్రామంలో పర్యటించారు. ఇళ్ళు కూల్చేస్తామంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన ఇళ్లను పరిశీలించి, ప్రజలను పరామర్శించారు. దాదాపు 250 ఇళ్లకు నోటీసులు ఇచ్చారని స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. పేదల కన్నీళ్లతో అభివృద్ధి చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే అనడం దారుణమని లోకేష్ అన్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు.
ఇక్కడ ఉంటున్న ప్రజలకి పట్టాలు కూడా ఇచ్చారు. ఇద్దరి మధ్య ఉన్న సమస్య బూచిగా చూపి 250 ఇళ్ళు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. కురగల్లు లో వెయ్యి మందిని రోడ్డు మీద పడేయడానికి ఎమ్మెల్యేకి మనస్సు ఎలా వచ్చింది. ప్రజలకి అండగా న్యాయ పోరాటం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. నిడమర్రు లో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన ఇళ్లను పరిశీలించారు. నిడమర్రు లో 105 ఇళ్ళు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.