– ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దావోస్ వేదికపై నాశనం చేశారు
– తండ్రీ కొడుకుల నిర్వాకంతో పారిశ్రామికవేత్తల పరార్
– జగన్ హయాంలో ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు
– విశాఖ జీఐఎస్లో రూ.13.5 లక్షల కోట్లకు ఎంఓయులు
– బాబు పాలన చూశాక పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది
– వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కె రోజా
నగరి: దావోస్ నుంచి ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి రావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏ ముఖం పెట్టకుని ఏపీలో అడుగు పెడుతున్నారని అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కె రోజా నిలదీశారు. తిరుపతి జిల్లా నగరిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్లో పారిశ్రామికవేత్తలు పారిపోయారని మండిపడ్డారు.
పక్క రాష్ట్రాల వారు లక్షల కోట్లు పెట్టుబడులతో తిరిగి వస్తుంటే.. చంద్రబాబు మాత్రం కట్టుకథలతో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తండ్రీ కొడుకులిద్దరూ సర్వనాశనం చేశారని ఆర్కె రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు దావోస్ పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తారని ప్రజలు భావించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు. మొదటి ఏడాది దావోస్ వెళ్లారు. రాష్ట్ర ప్రజలు, కూటమి పార్టీల నాయకులు గర్వపడేలా దావోస్ నుంచి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి కనీసం ఈ ఏడాది కోసం నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించడం ద్వారా సంపద సృష్టిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఆయన రాష్ట్రంలో కాలుపెట్టగానే భారీగా సన్మానాలు, సత్కారాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చంద్రబాబు, లోకేష్ లు దావోస్ కు వెళ్ళి ఏం తీసుకువచ్చారని చూస్తే శూన్యం. ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ రూ.1.32 లక్షల కోట్లు, మహారాష్ట్ర రూ.15.75 లక్షల కోట్లకు ఎంఓయులు చేసుకున్నారు. పద్నాలుగేళ్ళ సీఎం అనుభవం, విజనరీని అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఇంత దారుణంగా రాష్ట్రానికే అవమానం కలిగేలా ఉత్తి చేతులతో వస్తున్నారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఈ అవమానం.
చంద్రబాబు, లోకేష్ దావోస్ వెళ్ళేప్పుడు తమ ప్రచారం కోసం లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు జాతీయ మీడియాకు పెద్ద ఎత్తున డబ్బును ఇచ్చేందుకు జీఓలు జారీ చేశారు. పవన్కళ్యాణ్ వల్లే ఈరోజు చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. కానీ పవన్కళ్యాణ్ను దావోస్కు తీసుకు వెళ్ళలేదు. తన కుమారుడు నారా లోకేష్కు రాబోయే రోజుల్లో పవన్కళ్యాణ్ అడ్డు వస్తాడనే అనుమానంతో ఆయనను పక్కకు పెట్టారు.
పెట్టుబడులు తీసుకురాలేక పోవడానికి కారణం లోకేష్ రెడ్బుక్ పాలనే. వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఒకేసారి దావోస్ వెళ్లిన సీఎం వైయస్ జగన్, రూ.1.26 లక్షల కోట్లకు ఎంఓయులు కుదుర్చుకుని వచ్చారు. అలాగే విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రూ.13.5 లక్షల కోట్లకు ఎంఓయులు చేసుకున్నారు. ఈ నెలలో సాక్షాత్తు ప్రధాని శంకుస్థాపన చేసిన రూ.1.86 లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, అలాగే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్లను సీఎంగా వైయస్ జగన్ ఈ రాష్ట్రానికి తీసుకువచ్చారు.
జగన్ విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు రిలయన్స్ అధినే ముఖేష్ అంబానీతో పాటు, గౌతమ్ ఆదానీ, జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు స్వయంగా హాజరయ్యారు.
జగన్ పాలనలో కట్టుదిట్టంగా శాంతిభద్రతలు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయికి పాలన, మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్ట్ ల నిర్మాణం, భోగాపురం విమానాశ్రయం పనులు, పది ఫిషింగ్ హార్బర్ ల పనులు ముమ్మరం చేశారు. రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి ఆయన ఆహ్వానించారు.
చంద్రబాబు మత్తులో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఉన్నాడు. దావోస్కు ఆయన్ను తీసుకువెళ్ళలేదు అంటే పవన్ వల్ల ఎటువంటి పెట్టుబడులు రావు అని చంద్రబాబు భావించారా? లేదా లోకేష్కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకున్నారా? ఇంకా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న భజన చూసిన పారిశ్రామికవేత్తలు దావోస్లో అవాక్కయ్యారు.