Suryaa.co.in

National

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య పై ఐటి దాడులు

– శ్రీ చైతన్య పై హైదరాబాద్, వియవాడ, ముంబై, పుణె, బెంగళూరులో ఏకకాలంలో ఐటి దాడులు
– 20 బృందాలతో శ్రీచైతన్య విద్యాసంస్థలపై సోదాలు
– ఫీజులు క్యాష్ రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు
– వాటికి పన్నులు ఎగ్గొడుతున్నందుకే ఐటీ దాడులు

హైదరాబాద్: అధిక ఆదాయం, విద్యార్ధుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీచైతన్య విద్యాసంస్ధలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడం షాక్ ఇచ్చింది.

విద్యార్ధుల వద్ద ఫీజులను ఆన్‌లైన్‌లో కూడా కాకుండా.. క్యాష్ వసూలు చేస్తూ, వాటికి ఐటీ చెల్లించకుండా ఎగ్గొడుతున్నారన్నది ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు. దానితో రంగంలోకి దిగిన 20 మంది ఐటి అధికారుల బృందం శ్రీచైతన్య కాలేజీ కార్యాలయాలను జల్లెడ పట్టింది. ఈ సోదాలు మంగళవారం కూడా కొనసాగే అవకాశాలున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు దేశవ్యాప్తంగా నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాల్లోని శ్రీచైతన్య కళాశాలల శాఖల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు.

విద్యార్థుల నుంచి నిర్దేశించిన ఫీజులను ఆన్‌లైన్‌లో వసూలు చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను, పన్ను ఎగవేతకు మరో సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థుల నుంచి నగదు రూపంలోనే ఫీజులు వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

నగదు రూపంలో వసూలు చేసిన ఫీజులను ఐటీ రిటర్న్స్‌లో చూపకుండా పన్ను ఎగవేస్తున్నారని అనుమానిస్తున్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ఫీజులు, పరీక్ష ఫీజులు, అడ్మిషన్ ఫీజుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, దీని ద్వారా పన్ను ఎగవేసే అవకాశం ఉందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో, ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేసి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు శ్రీచైతన్య విద్యా సంస్థలపై అభియోగాలు.

మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న  కళాశాల ప్రధాన కార్యాలయంలో కార్పొరేట్ వ్యవహారాలు, విద్యార్థులకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. సుమారు 20 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

LEAVE A RESPONSE