మునుగోడు సెగతో గాయి గాయి చేస్తున్న కేసీఆర్

  • సుపరిపాలనలో మోదీ కాలి గోటికి సరిపోడు
  • దేశంలోనే ఫెయిల్యూర్ సీఎం కేసీఆర్
  • కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీంలన్నీ అట్టర్ ఫ్లాప్
  • లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, మిషన్ భగీరథతో ఒరిగిందేమిటి?
  • వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే
  • కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

సెగ తగిలితే బొక్కలో ఎలుక ఎట్లా బయటకు వస్తదో… ఎన్నికలొస్తే కేసీఆర్ ఆ విధంగా ఫాంహౌజ్ నుండి బయటకు వస్తాడని మరోసారి నిరూపితమైంది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో వికారాబాద్ లో సభ పెట్టి ఇంకోసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేసిండు.

వికారాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే. తాను చెబుతున్నది అబద్దమని తెలిసి కూడా ఏ మాత్రం మొహమాటం, సిగ్గు లేకుండా మాట్లాడటం కేసీఆర్ కే చెల్లింది. వికారాబాద్ జిల్లాకు సాగు, తాగు నీటి సౌకర్యం లేకుండా చేసింది ముమ్మాటికీ కేసీఆరే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా 10 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు కోసం తెచ్చిన వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చయినవ్. నిధులు కూడా లేని పరిస్థతి. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వికారాబాద్ కు నీళ్లిచ్చేదెప్పుడు?

డిజైన్ లోపంతో పాలమూరు-రంగారెడ్డి అండర్ గ్రౌండ్ పనుల కారణంగా కల్వకుర్తి పట్టణం మునిగిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్ కు వికారాబాద్ ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదు. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ద పాలమూరు-రంగారెడ్డి పట్ల లేకపోవడమే కారణం. తద్వారా దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కేసీఆర్ ను ప్రజలు క్షమించబోరు.

పదేపదే తెలంగాణ రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా? అంటూ కేసీఆర్ మాట్లాడటం విడ్డూరం. బీజేపీ పార్లమెంట్ లో మద్దతివ్వకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఆయన సీఎం అయ్యేవారా? అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణను 4 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పుల్లో ముంచేసి పుట్టబోయే ఒక్కో బిడ్డపైనా రూ.1.20 లక్షల అప్పుభారం మోపిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెవరైనా ఉంటారా?

కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలన్నీ అట్టర్ ఫ్లాప్ కార్యక్రమాలే. రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. రూ.40 వేల కోట్లకుపసైగా ఖర్చు పెట్టిన మిషన్ భగీరథ పథకంవల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నేటికీ రాష్ట్రంలోని అనేక గ్రామాలకు అసలు నీళ్లే రావడం లేదు. భగీరథ నీళ్చొచ్చిన గ్రామాల్లోనూ ప్రజలు వాటిని తాగడం లేదు. కావాలంటే సీఎంకు భగీరథ నీళ్ల బాటిళ్లను పంపిస్తాం. ఎంతవరకు ఆ నీళ్లను ప్యూరిఫైడ్ చేశారో కేసీఆర్ చెప్పాలి.

రైతులకు ఏదేదో చేశానని చెప్పుకుంటున్న కేసీఆర్ నిజానికి రైతుల పాలిట రాబందు.. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లు…చితికిపోతున్న కౌలు రైతులకు పైసా చేయకుండా బడా భూస్వాములకు, కాలేజీల భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు ఇస్తున్న ఘనత కేసీఆర్ దే. కేసీఆర్ వచ్చాక వడ్ల కుప్పలపై రైతులు చనిపోయిన దుస్థితి తెలంగాణలో వచ్చింది.

పదేపదే రైతులను రెచ్చగొట్టేందుకు పంపుసెట్లకు మీటర్లు పెడతారంటూ ప్రచారం చేయడం సిగ్గు చేటు. ఉచిత కరెంట్ కేంద్రం వద్దన్నట్లుగా చిత్రీకరించే కుట్రలకు పాల్పడుతున్నడు. రైతులకు ఉచిత కరెంట్ పేరిట ఫాంహౌజ్ లకు ఉచితంగా కరెంట్ కట్టబెట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ నేతల కరెంట్ దొంగతనాన్ని బయటపెట్టేందుకు కేంద్రం సిద్ధమైతుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా కేసీఆర్ గాయిగాయి చేస్తున్నడు.

ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ లో దాదాపు 30 గ్రామాలకు సరిపడా కరెంట్ ను వాడుకుంటున్నరు. అట్లాగే ఇతర మంత్రులు, ఎంపీల, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ఫాంహౌజ్ ల్లో సైతం ఒక్కొక్కరు 25 గ్రామాలకు సరిపడా వాడే కరెంట్ ను వినియోగిస్తున్నారు. ఈ దొంగతనం బయటపడొద్దనే సీఎం కేంద్రంపై లొల్లి చేస్తున్నాడు.

కేంద్రం ఏనాడూ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని చెప్పలేదు. ఉచిత కరెంట్ ఇవ్వడాన్ని ఏనాడూ వ్యతిరేకించలేదు. అయినా డిస్కంలను రూ.60 వేల నష్టాల్లోకి నెట్టి రైతులకు ఉచితంగా తానే కరెంట్ ఇస్తున్నట్లుగా చెప్పుకోవడం దుర్మార్గం.

తెలంగాణలో పథకాలను చూసి పక్క రాష్ట్రం వాళ్లు కూడా వాటిని అమలు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారని కేసీఆర్ చెప్పడం ఆయన డాంబికాలకు నిదర్శనం. మన రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు, సరిహద్దు ప్రాంతాల ప్రజలు పక్కనున్న కర్నాటకకు పోయి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటున్న సంగతి కేసీఆర్ తెలుసుకుంటే మంచిది.

పెట్రోలు, డీజిల్ రేట్లను కేంద్రం పెంచిందని గాయి చేస్తున్న కేసీఆర్… తెలంగాణతో పోలిస్తే కర్నాటకలో పెట్రోలు లీటర్ కు దాదాపు 10 రూపాయలు తక్కువగా లభిస్తోందనే సంగతి గుర్తుంచుకోవాలి. అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం సిగ్గు చేటు.

తెలంగాణను ఎక్కిరించినోళ్లు, నవ్వినోళ్లంతా ఎక్కడున్నారంటూ కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నాడు తెలంగాణను వ్యతిరేకించినోళ్లు, ఎక్కిరించినోళ్లంతా ఈరోజు టీఆర్ఎస్ లోనే ఉన్న వాస్తవాన్ని గుర్తెరిగి మాట్లాడితే మంచిది.

సింగరేణి గురించి మాట్లాడే అర్హత కూడా కేసీఆర్ కు లేదు. లాభాల్లో ఉన్న సంస్థ 20 వేల కోట్ల రూపాయల అప్పులపాల్జేసిన ఘనుడు కేసీఆర్. 8 ఏళ్ల కాలంలో 42 వేల ఉద్యోగాలను తీసేసిన దుర్మార్గుడు కేసీఆర్. సింగరేణి నిల్వలు తగ్గుతున్నాయని అనుకున్నప్పుడు మాత్రమే బయట బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం చెప్పిందే తప్ప సింగరేణి బొగ్గు ఉత్పతి పెరిగిన తరువాత ఆ జీవోను కూడా రద్దు చేసిన సంగతి కేసీఆర్ తెలుసుకోవాలి.

ఈ మధ్య కాలంలో దేశ అభివ్రుద్ధి, రాజకీయాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. ముందు తెలంగాణ గురించి ఆలోచించు. సుపరిపాలన విషయంలో నరేంద్రమోదీ కాలిగోటికి కూడా సరిపోవు. మోదీ పాలనను ప్రపంచ దేశాలు పలుమార్లు కీర్తించాయి. ఇప్పటి వరకు అవినీతి మరక అంటకుండా దేశాన్ని ఏలుతున్న మహానాయకుడు. అలాంటి నాయకుడిని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్ కు లేదు.

Leave a Reply