– 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా?
– చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కోట్లాట పెట్టండి
– కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధమే
– హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందన
హైదరాబాద్ : మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంతు రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని విమర్శించారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంతు రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చండి అని చెప్పారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. ఢిల్లీని నిలదీస్తుందని తెలిపారు.