మంగళగిరి: ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ రాకపోయినా రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వైకాపా దాడులను నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్భవన్కు మంగళగిరి నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. గంజాయితో యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారని విమర్శించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. ఎవరూ లేని సమయంలో వైకాపా మూకలు దాడిచేశారు.. దమ్ముంటే ఇప్పడు రావాలని సవాల్ విసిరారు. పోలీసుల అండ లేకుండా వైకాపా నేతలు బయటకు రావాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వారు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ హెచ్చరించారు.
‘‘పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం. కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలు మీరు గాయపరచలేరు. తెదేపా కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే .. రెండు చెంపలు వాయగొడతాం. జగన్రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్యకేసు తేల్చాలి. రెండున్నరేళ్లు ఆగండి .. చంద్రబాబే మళ్లీ సీఎం. 2024లో మంగళగిరిలో తెదేపాను గెలిపించి కానుకగా ఇస్తా. వైకాపాకు ట్రైలర్ మాత్రమే చూపాం.. సినిమా ముందుంది’’ అని లోకేశ్ కార్యకర్తలకు భరోసా కల్పించారు.