– యూనిట్ 1 బాయిలర్ లో ఆయిల్ లీక్?
– ట్రయల్ రన్కు సిద్ధమవుతుండగా ప్రమాదం
– నిలిచిపోయిన 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి
యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున నల్గొండ జిల్లా దామరచర్ల, మండలం పీర్ల పాలెం లోని పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. యూనిట్ 1 బాయిలర్ లో ఆయిల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
సోమవారం తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో మొదటి యూనిట్ లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్కు సిద్ధమవుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్ ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటు లోని రెండో యూనిట్ నుంచి ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి చేస్తున్న క్రమంలో.. ఈఎస్పీ వద్ద యాష్ జామ్ కావడంతో ట్రిప్ అయ్యి బాయిలర్ నిలిచి పోయింది. జామ్ అయిన యాష్ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీడ పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.