వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోడీ, కేసీఆర్

Spread the love

-నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం తగదు
-అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందే
-ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర
– సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క

వ్యవసాయ రంగాన్ని కావాలనే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు సంక్షోభంలోకి నెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బడా వ్యాపారులు కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పే కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని మండిపడ్డారు. యాసంగి వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా మెడలు వంచుతామని, రైతులు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు.

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ “తాగండి, తాగి ఊగండి, ప్రభుత్వానికి పన్నులు కట్టండి.” అన్నట్లుగా ఊరి, ఊరికి వైన్స్ బెల్ట్ దుకాణాలను ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల ల్లో సాధించిన అభివృద్ధి ఇది ఒకటేనని ఎద్దేవా చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పథకాలు తీసుకురావాలని సూచించారు.

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 2.30 లక్షల కోట్లు దోపిడి జరుగుతుందని ఆరోపించారు. నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాబడిని కొల్లగొడుతున్నదని ధ్వజ మెత్తారు. రైతుబంధు పేరిట ఎకరానికి 5వేల రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏటా 50 వేల వరకు నష్టపరుస్తుంది అని వివరించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై సమర శంఖాన్ని పూరించడానికి ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో జనవరి 9 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను అసెంబ్లీకి తీసుకువెళ్లి ప్రభుత్వంపై తన గళం వినిపిస్తానని వెల్లడించారు.

మాజీ MLC పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులను వరి సాగు చేయోద్దని సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరిని ఏ విధంగా సాగు చేస్తారని ప్రశ్నించారు. వరి వేస్తే రైతులు ఉరి పెట్టుకోవాలన్న సీఎం కేసీఆర్
ఉరి వేసుకోవడానికి వరి సాగు చేశారా అని నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని మాట తప్పిన కేసీఆర్ దళితుడికి ప్రతిపక్ష హోదా వస్తే కూడా జీర్ణించుకోలేదని విమర్శించారు.

వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిక
ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్, సిపిఎం పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి భట్టి విక్రమార్క పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మామినూర్ గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు దోమందులు వీరయ్య, బుచ్చిరెడ్డి పాలెం కు చెందిన టిఅర్ఎస్ యువకులు, ఎర్రుపాలెం కు చెందిన టిఆర్ఎస్, సిపిఎం నాయకులు పల్లపు శ్రీనివాస్ రెడ్డి, షేక్ గౌస్, షేక్ జానీ, రసూల్, శ్రీను, మీరా బి, రఫీ తదితరులు ఉన్నారు.

మీనవోలు లో భట్టికి ఘన స్వాగతం
ప్లీనరీ కి వెళ్తున్న భట్టి విక్రమార్కకి మీనవోలు గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ, స్వర్గీయ
bhatti1
ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారల విగ్రహాలకు భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహిళలు మంగళ హారతులు పట్టారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలు, హోరెత్తిన కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో అక్కడినుంచి బైక్ ర్యాలీ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కపై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావ వేణు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నవీన్ రెడ్డి, మధిర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురకంటి కిషోర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శీలం శ్రీనివాసరెడ్డి, పాండు రంగారావు, ప్రతాప్ రెడ్డి, నాగిరెడ్డి, శీలం నర్సిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పిల్లి బోసుబాబు, వెంకటనర్సయ్య, హన్మంతరావు, శీలం శారద, గంట తిరుపతమ్మ, గోపి, ఎంపీటీసీ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply