– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : మోడీ జీఎస్టీ 2.0 ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీ) పేరుతో 2017-18 నుంచి 2024-25 మధ్య ఎనిమిది ఏళ్లలో దోపిడీ చేసింది రూ.55,44,897 కోట్లు. ఇప్పుడు 2.O సంస్కరణల పేరుతో తగ్గించింది రూ.2.5 లక్షల కోట్లు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇన్నాళ్లు ఎడాపెడ పన్నుల మోత మోగించి, సామాన్యుల నడ్డి విరిచిన మోడీ… గోరంత ట్యాక్సులు తగ్గించి కొండంత చెప్పుకుంటున్నారని ఆమె విమర్శంచారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే.. తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అబద్ధం. ఆత్మనిర్భరత, నవశకం, నవతరం అనేది అంతా బూటకం. ఉత్సవాల పేరిట సభలు నిర్వహించడం హాస్యాస్పదం. రేపటి కర్నూల్ సభకు 7వేల బస్సులట. 5 లక్షల మంది జనసమీకరణ చేస్తారట.
ప్రజల సొమ్ముతో మోడీ సొంత భజన చేయడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి. స్వల్పకాలిక జీఎస్టీ పన్నుల సవరణతో ఏపీ ప్రజలకి తగ్గిన ట్యాక్సుల భారం రూ.8వేల కోట్లు మాత్రమే. ఇది ఎంతమాత్రం ప్రజలకు ఉపశమనం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరగాలంటే కావాల్సింది జీఎస్టీ ఉత్సవాలు కాదు.. “ప్రత్యేక హోదా”.
హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని. హోదాతోనే పరిశ్రమలు, భారీగా పన్ను రాయితీలు, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు. 2014లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అమలైవుంటే నేడు దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేది. కర్నూల్ జిల్లాలో జీఎస్టీ 2.0 ఉత్సవ సభకు వస్తున్న మోడీని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి వేదికగా ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి హోదా అంశాన్ని దాటేస్తున్నారు. విభజన హామీలపై సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఈసారైనా ప్రత్యేక హోదా ప్రకటన చేయాలి. లేకుంటే హోదాపై బీజేపీ వైఖరి ఏంటో తేల్చాలి.