మహిళలకు కవిత క్షమాపణ చెప్పేదాకా ఉద్యమించండి

– రేపు బీజేపీ కార్యాలయంలో ‘‘మహిళా గోస – బిజెపి భరోసా’’ దీక్ష
– మహిళలను మోసం చేస్తున్న తన తండ్రి ఇంటిముందు దీక్ష చేయాలి
– కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు
– 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డకు తప్ప ఏ ఒక్క మహిళకు కూడా ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు.
-ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు డీకే అరుణసహా దీక్ష చేయనున్న మహిళా మోర్చా నేతలు
-కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడమే లక్ష్యం
– మహిళలను కేసీఆర్ కుటుంబం చేస్తున్న మోసాలను తెలియజేయడమే ఉద్దేశం
-మహిళలకు కేసీఆర్ ఫ్యామిలీ చేస్తున్న ద్రోహన్ని దీక్ష ద్వారా యావత్ దేశానికి తెలియజేద్దాం
-మహిళా నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు

భారతీయ జనతా పార్టీ ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’పేరుతో మరో దీక్షకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడంతోపాటు గత 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మహిళలకు చేసిన మోసాలను, ద్రోహాన్ని తెలంగాణ సమాజంతోపాటు యావత్ దేశానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మహిళా మోర్చా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష చేయాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతితోపాటు మహిళా మోర్చా రాష్ట్ర నాయకులంతా ఈ దీక్షలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
2014 నుండి కేసీఆర్ కుటుంబమే అధికారంలో ఉంది. అంతకుముందు యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కానీ ఏనాడూ మహిళా బిల్లుపై నోరు మెదపలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లుపైగానీ, మహిళా సమస్యలపైగానీ స్పందించలేదు. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డకు తప్ప ఏ ఒక్క మహిళకు కూడా ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. 2019లో ఇద్దరికి మాత్రమే అవకాశమిచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 4గురికి మాత్రమే టిక్కెట్లిచ్చారు.

కేసీఆర్ కుటుంబం ఏనాడూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై స్పందించలేదు. మద్యాన్ని ఏరులై పారించారు. ఊరూరా బెల్టుషాపులను తెరిపించారు. మహిళల తాళిబొట్లు తెగిపోతున్నా ఏనాడూ మాట్లాడలేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు సహా మహిళా ప్రజాప్రతినిధులకు అవమానాలు జరుగుతున్నా, కన్నీళ్ల పర్యంతమైన ఏనాడూ నోరు మెదపలేదు.

దొంగ సారా దందాతో కోట్లు దండుకోవాలనుకున్న కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులివ్వగానే కేసీఆర్ కుటుంబానికి మహిళా బిల్లు గుర్తుకొచ్చింది. దీక్షలు గుర్తుకొచ్చాయి. తెలంగాణ మహిళలు ఏమైనా ఫరవాలేదు…తప్పు చేసిన తన బిడ్డ జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదని గాయిగాయి చేయాలని చూస్తున్నరు. లిక్కర్ కేసు నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మహిళా దీక్ష పేరుతో డ్రామాకు తెరదీశారు.

కవితకు నిజంగా మహిళలపట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళలను మోసం చేస్తున్న తన తండ్రి ఇంటిముందు దీక్ష చేయాలి. పార్టీలో, ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం పదవులెందుకు ఇవ్వలేదని నిలదీయాలి. అట్లా కాకుండా తన దొంగ సారా దందాను కప్పిపుచ్చుకునేందుకు మహిళా దీక్ష పేరుతో డ్రామా చేయడాన్ని మీరంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ మహిళలకు చేస్తున్న అన్యాయాలను, మోసాలను ఎండగట్టడమే లక్ష్యంగా చేపట్టిన ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్షకు భారీ ఎత్తున మహిళలు హాజరై విజయవంతం చేయాలి. కవిత మహిళా బిల్లు దీక్ష వెనుక ఉన్న కుట్రలను, మోసాలను యావత్ దేశానికి తెలియజేయండి.

ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపొద్దు. తెలంగాణ మహిళలకు కవిత క్షమాపణ చెప్పేదాకా ఉద్యమించండి. మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్న కేసీఆర్ కుటుంబం తొలుత బీఆర్ఎస్ పార్టీలో 33 శాతం మందికి సంస్థాగత పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చేదాకా పోరాడండి.

Leave a Reply