అమరావతి: ఎన్నికల హామీ ప్రకారం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. కొత్త బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.9407 కోట్లు కేటాయించగా, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకారం, కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే, ఒకే విడతగా చెల్లిస్తారా లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లింపులు చేయాలా అన్న విషయంపై ఇంకా చర్చ కొనసాగుతోంది.
పథకం అమలులో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కీలక మార్గదర్శకాలు రూపొందించబడుతున్నాయి. విద్యార్థుల 75 శాతం హాజరును తప్పనిసరి నిబంధనగా కొనసాగించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండిన ఆదాయపన్ను చెల్లింపుదారులు, తెల్లరేషన్ కార్డు లేని వారు, అధిక విద్యుత్ వినియోగం చేసేవారికి మినహాయింపు నిబంధనలను సమీక్షిస్తున్నారు. కొత్త మార్గదర్శకాల్లో ఈ నిబంధనలు కొనసాగించాలా లేక సడలింపులు ఇవ్వాలా అన్న అంశంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో “తల్లికి వందనం” పథక అమలులో కొన్ని సందిగ్ధతలు తలెత్తుతున్నాయి. ఒకే విడతలో మొత్తం రూ.15 వేలు చెల్లిస్తారా, లేదా రెండు విడతలుగా రూ.7500 చొప్పున ఇవ్వాలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. విద్యాశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం దాదాపు 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పన కొనసాగుతుండగా, మే నెలలో అమలు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది