ఒమిక్రాన్ ముంచుకొస్తోంది…కళ్లు తెరవండి సిఎం గారూ!

– సెకండ్ వేవ్ లో కళ్లెదుటే వందలమంది కన్నుమూశారు
– కోవిద్ మరణాలకు రెట్టింపు క్లెయిమ్ లు ఎలా వెళ్లాయి?
– వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాం…బూస్టర్ డోస్ ఊసేలేదు
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ కంటే ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. కోవిడ్ రెండు దశలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక రోగులు కళ్లెదుటే మరణించిన హృదయ విదారక ఘటనలు చూశాం.
గతంలో మాదిరి సిఎం ప్యాలెస్ కు పరిమితం కాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలి. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం దేశంలోని మిగతారాష్ట్రాలకంటే ఏపీ వ్యాక్సినేషన్ లో బాగా వెనుకబడిఉంది. రాష్ట్రంలో రెండుడోసులు కలిపి 6 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చారు. జనాభాలో సగభాగానికి కూడా వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. రాష్ట్రంలో ఎంతమందికి వ్యాక్సిన్లు ఇచ్చారు…ఏఏ జిల్లాల్లో ఎన్నివ్యాక్సిన్ల నిల్వలున్నాయి… ఏ జిల్లాలు వ్యాక్సిన్ లో వెనుకబడ్డాయి అనే వివరాలు ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయడంలేదు.
కోవిద్ మరణాల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించింది. రాష్ట్రంలో అధికారికంగా నమోదైన కోవిడ్ మరణాలకంటే (14,431) రెట్టింపు క్లెయిమ్ లు (28,468) ఎక్స్ గ్రేషియా కోసం వచ్చినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్వి సంజీవ్ కుమార్ జిందాల్ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. కేంద్రం విడుదలచేసిన రూ.50వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను కూడా రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు అందజేయకపోవడం విచారకరం.
రెండుడోసులు పూర్తిచేసుకున్నవారికి ఇచ్చే బూస్టర్ డోసుపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచనే చేయడంలేదు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, ఐసీయూపడకల ఏర్పాటు, వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారం తక్షణమే ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. నిన్నసాయంత్రం సమాచారం ప్రకారం రాష్ట్రంలో 2 వేల యాక్టివ్ కేసులున్నాయి. వరదల్లో ప్రభుత్వనిర్లక్ష్యానికి ఎందరు బలయ్యారో చూశాం, ఒమిక్రాన్ ఉధృతి రాష్ట్రంలో తీవ్రమై జరగాల్సిన నష్టం జరిగాక, ప్రభుత్వం స్పందించినా ఉపయోగం ఉండదు. ముఖ్యమంత్రి తక్షణమే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి, ఒమిక్రాన్ ను ఎదుర్కోవడానికి రాష్ట్రానికి అవసరమైన వాటిని ఏర్పాటుచేసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
యూకే, యూఎస్ఏ, డెన్మార్క్, ఆస్ట్రేలియా, జర్మనీ, హాంకాంగ్, నెదర్లాండ్ ఇంకా 29 దేశాలతోపాటు మన దేశంలో తాజాగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. సెకెండ్ వేవ్ తర్వాత కోవిడ్ నిబంధనలు కొంత ఉపశమనం ఇవ్వడం, ప్రపంచంలోని ప్రజలంతా సాధారణ జీవన స్థితికి వచ్చారు. సెకెండ్ వేవ్ లో మనకున్న అనుభవాల దృష్ట్యా, సెకెండ్ వేవ్ లో జరిగిన ప్రాణ నష్టాన్ని మనందరం గమనించాం. ఆ అనుభవాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
గతంలో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సీజన్ సరిగ్గా అందక, వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నంత విధంగా జరగకపోవడం, మందులు సరిగ్గా దొరకకపోవడంతో తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కోవిడ్ సెకెండ్ వేవ్ లో అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా తిరుపతి రుయా ఆసుపత్రి, విజయనగరం, అనేక జిల్లాల్లో ఆక్సీజన్ అందక రోగులు మరణించిన హృదయ విచారక దృష్యాలు మనందరం చూశాం. కాబట్టి కోవిడ్ సెకెండ్ వేవ్ అనుభవాల దృష్ట్యా ముందుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది…తక్కువ సమయం ఉన్నందున స్పందించడానికి సమయం ఉండదు కాబట్టి ముందుగానే అన్ని రకాల సమీక్షలు చేసుకుని సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిని కోరుతున్నాం. గతంలో మీ ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో, మీ నిర్లక్ష్యం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇప్పుడైనా ముందుగా మేల్కొని ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, ఐసీయూ బెడ్స్, మందులు వంటి అన్ని ఏర్పాట్లపై ముందుగా సమీక్ష చేసుకుని సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇప్పటి వరకూ ఒమిక్రాన్ గురించి ఎక్కడా సమీక్ష చేసినట్లు మేము చూడలేదు. అలసత్వం ప్రదర్శించకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాలి.
వ్యాక్సినేషన్ లో చాలా వెనకడి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా ముందుకు తీసుకెళ్లకపోతే ప్రాణానష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ చేయించకున్న వారికి కూడా ఈ ఒమైక్రాన్ సోకుతున్నప్పటికీ ప్రాణాలుపోయే పరిస్థితి తక్కువగా ఉన్నందున వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది.
నిన్న కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసినట్లైతే అనేక రాష్ట్రాల కంటే మన రాష్ట్రం వ్యాక్సినేషన్ లో వెనకబడి ఉంది. ఉదాహరణకు ఉత్తప్రదేశ్ లో 16.38 కోట్ల మందికి వ్యాక్సినేషన్ డోసులు, పశ్చిమ బెంగాల్ లో 9.31 కోట్ల మందికి, మహారాష్ట్రలో 11.52 కోట్లు, మద్యప్రదేశ్ లో 8.81కోట్లు, గుజరాత్ లో 8.10కోట్లు, బీహార్ లో 8.24కోట్ల డోసులు, రాజస్థాన్ లో 6.90 కోట్లు డోసులు ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఫస్ట్, సెకెండ్ డోసులు కలిపి కూడా 6 కోట్ల డోసులే ఇవ్వడం జరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాల కంటే మనం వెనకడిఉన్నాం. మీరు విడుదల చేసే కోవిడ్ బులిటెన్ లో వ్యాక్సినేషన్ కు సంబంధించిన డేటాను పొందుపరచడం లేదు.
నిన్న విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కోవిడ్ టెస్టులకు సంబంధించి 29,263 శాంపిల్స్ పరీక్షించగా, 159 మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా గుర్తించారు, ఒక్కరు మరణించినట్లుగా ఉంది. అయితే బులిటెన్ లో ఎక్కడా వ్యాక్సినేషన్ కు సంబంధించి వివరాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. మొదటి డోస్, సెకెండ్ డోస్ ఎంత మందికి ఇచ్చారన్న సమాచారం లేదు. వ్యాక్సినేషన్ కు సంబంధించిన డేటా ప్రతిరోజూ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఏ జిల్లాలో ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన పరిస్థితిని, వ్యాక్సినేషన్ ఎంత నిల్వలు ఉన్నాయో తెలియాలి.
వ్యాక్సినేషన్ ప్రొక్యూర్ మెంట్ చేయకపోవడంలో వెనకడి ఉన్నారు. ఎన్ని డోసులు ఉన్నాయి, ఎంతమందికి ఫస్ట్, రెండో డోస్ ఇచ్చారు తెలపాలి. ఇప్పుడు బూస్టర్ షాట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్, సెకెండ్ డోస్ పూర్తి చేసుకోకపోతే ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే బూస్టర్ డోస్ లు కూడా అవసరం. రెండు డోసులూ పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లైతే ప్రాణాలకు రక్షణగా ఉన్నట్లు ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు మాట్లాడుతున్నారు.
ఈ సందర్భంలో మీరు ఇంకా ఫస్ట్, సెకెండ్ డోస్ పూర్తి చేయకపోతే భవిష్యత్ లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందిన తర్వాత ప్రాణాలకు భద్రత ఎక్కడ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. యాక్టివ్ కేసెస్ లో దేశంలో మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. నిన్న సాయంత్ర వరకు రిపోర్టు చేసిన డాటా ప్రకారం 150 యాక్టివ్ కేసులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు ఈ ఒమైక్రాన్ గురించి ఈ రకమైన చర్యలు తీసుకోవాలి, జిల్లాలో ఉన్న సౌకర్యాలు ఏంటి?, తక్షణమే మీరు సమాచారాన్ని ప్రజలకు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సెకెండ్ వేవ్ తర్వాత మీరు చేపట్టిన చర్యలేంటి? ఏయే ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ పెంచారు? ఆక్సిజన్ ప్లాంట్స్ కొత్తగా ఎన్ని ఏర్పాటు చేశారు..? ఎక్కడ కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయి.? వ్యాక్సినేషన్ కు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ప్రజల ముందు తక్షణమే ఉంచాల్సిన బాద్యత మీపై ఉంది.
రేపు అత్యవసర పరిస్థితి వచ్చాక ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ సరైన సౌకర్యాలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఎంతమేర అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది, ఏ జిల్లాలో స్టాక్ అందుబాటులో ఉందో సమాచారం లేకపోతే రాష్ట్రం ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ఆ సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నా. మొన్న తుఫాన్ల సందర్భంగా మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయి, ఆస్తినష్టం జరిగిందో ప్రత్యక్షంగా చూశాం. దొంగలుపడ్డ ఆరునెలలకు పోలీసులు వెళ్లి విచారణ చేసినట్లు తుఫాన్ వల్ల సర్వస్వం కోల్పోయిన తర్వాత అలో లక్షణా అని ప్రజలంతా రోడ్ల తిండిలేక అలమటిస్తున్న తర్వాత దాదాపు 3 వారాలకు ముఖ్యమంత్రి పరామర్శకు వెళ్లారు.
చేతుల కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు ముఖ్యమంత్రిగారు. కనీసం సెకెండ్ వేవ్ అనుభవాల దృష్ట్యా అయినా ఒమిక్రాన్ పట్ల సీరియస్ గా స్పందించాల్సిన అవసరం వుంది. తక్షణమే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం నుండి రావాల్సిన వ్యాక్సినేషన్, మందులు వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రతిరోజూ విడుదల చేసే కరోనా బులిటెన్ లో వ్యాక్సినేషన్ డేటా జిల్లాల వారీగా పొందుపరచాలి.
వ్యాక్సినేషన్ స్టాక్, వ్యాక్సినేషన్ సెంటర్లు, ఎక్కడ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందో రోజువారీ బులిటెన్ లో తెలపాలి. మీ వాలంటీర్లను ఇళ్లకు పంపి పదివేలు వసూలు చేసే పనిలో మీరు ఉన్నారు కానీ అదే వాలంటీర్లు ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ జరిగిందో లేదో తెలుసుకునే పరిస్థితి ఉందా? మీకు డబ్బు వసూళ్లపైన, ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ వ్యాక్సినేషన్ ప్రక్రియపై లేదు.
ప్రజల ఆరోగ్యం కాపాడానికి, ప్రజలకు మరింత సేవలు అందించడం కోసం వాలంటీర్లను ఏర్పాటు చేశామని చెప్పి కలెక్షన్ ఏజెంట్లుగా మార్చారు. తక్షణమే మీ వాలంటీర్లను ఇంటింటికీ పంపించి, వ్యాక్సినేషన్ ఎవరికి ఎరికి జరిగింది? ఫస్ట్ డోస్ అయిందా, సెకెండ్ డోస్ అయిందా.? ఎవరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలో గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి వ్యాక్సినేషన్ కాని వారికి వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసే కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని స్పందించి ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలి, ముఖ్యమంత్రి సమీక్షించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply