🔹 హాజరైన శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు
🔹 గౌడ జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతా
🔹 ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన పల్లె రవికుమార్ గౌడ్
🔹 భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, గౌడ సామాజికవర్గం, బీసీ సంఘాల నాయకులు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంస్థ తొలి చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎగ్గెం మల్లేశం, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, క్రాంతి, భాస్కర్ రావు, గాదరి కిషోర్ పాల్గొని పల్లె రవికుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు పల్లె రవి కుమార్ గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
సహకరించిన మంత్రులు కేటీఆర్కు, వి. శ్రీనివాస్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను, కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా పల్లె రవికుమార్ గౌడ్ తెలిపారు. గౌడ సామాజికవర్గ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఉద్యమ నాయకులైన ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తున్నారనడానికి పల్లె రవికుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి గంగుల కమలార్ అన్నారు. మునుముందు ప్రజలకు సేవ చేసే అవకాశాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. తన కుల బాంధవులకు సేవ చేసే అవకాశం రావడం పల్లె రవి అదృష్టమని అన్నారు. పల్లె రవికి తన సహకారం ఎప్పడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులను సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుల వృత్తులను గౌరవించిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. రాబోయే రోజుల్లో గీత కార్మికులు రక్షణ కోసం అన్ని చర్యలు చేపడతున్నామని అన్నారు. పల్లె రవి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర జర్నలిస్టులను కలుపుకొని, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పేరుతో జర్నలిస్టుల ఐక్య పోరాటానికి పల్లె రవికుమార్ కృషి చేశారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
నల్లగొండ జిల్లా అభివృద్ధిలో పల్లె రవికుమార్ సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని అన్నారు.
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి గౌడ సామాజికవర్గంతో పాటు, బీసీ నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గీతకార్మిక కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్గౌడ్ నియామకంపై పలు గౌడ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్కు చైర్మన్ను నియమించడం ద్వారా గౌడ కులస్థులకు ఎంతో లబ్ధి చేకూరనున్నదని, సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అక్షరయోధుడు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బొడంగిపర్తి గ్రామానికి చెందిన పల్లె రవికుమార్గౌడ్ బీఎస్సీ, ఎంసీజే చదివారు. బీసీ సామాజికవర్గానికి చెందిన పల్లె రవికుమార్ది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం. తండ్రి పల్లె లింగయ్య సిపిఐ నుంచి సర్పంచిగా పనిచేశారు. పల్లె రవి విద్యార్థి దశలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై ఎన్నో కథనాలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులందరినీ ఏకంచేసి పోరుబాట పట్టించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలకంగా ఉన్న రవికుమార్.. అన్ని పార్టీల నేతలు ఉద్యమంలోకి వచ్చేలా కృషి చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిపోయిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మెలో జర్నలిస్టు నేతగా ముందు వరుసలో నిలిచారు.
స్వరాష్ట్రంలోనూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చండూరు ఎంపీపీగా పల్లెరవి సతిమణి పల్లె కల్యాణి కొనసాగుతున్నారు. భర్త బాటలో ఆమె కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.