Suryaa.co.in

Telangana

ఆర్టీసీ బ‌స్సుల‌ను ఈ మోడ‌ల్‌లోకి మార్చేందుకు స‌హ‌క‌రించండి

– కేంద్ర మంత్రి కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విన‌తి

ఢిల్లీ: హైద‌రాబాద్ న‌గ‌రంలోని వంద శాతం బ‌స్సుల‌ను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్‌లోకి మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆయ‌న కార్యాల‌యంలో సీఎం గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

పీఎం ఈ-డ్రైవ్ ప‌థ‌కం కింద జీసీసీ ప‌ద్ధ‌తిలో బ‌స్సులు కేటాయించాల‌ని ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపినట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఉన్న డీజిల్ బ‌స్సుల‌కు ఎల‌క్ట్రిక్ కిట్ అమ‌ర్చి రిట్రో ఫిట్మెంట్ ప‌ద్ధ‌తిలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులుగా మార్చేందుకు అవ‌కాశం ఉన్న విష‌యాన్ని కేంద్ర మంత్రి కుమార‌స్వామి దృష్టికి సీఎం ఏ.రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

హైద‌రాబాద్‌కు కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించే 2,800 బ‌స్సుల‌ను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడ‌ల్ కింద కేటాయించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, రాష్ట్ర మంత్రులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్ ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్‌, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులున్నారు.

 

LEAVE A RESPONSE