పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం డేట్ ఫిక్స్..

నెల్లూరు జిల్లా (శ్రీహరికోట) : ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ESO-04 లాంచింగ్‌ను ఫిబ్రవరి 14న జరపాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఈనెల 14న ఉదయం 5:59 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ వేదికగా నిర్వహించాలని తలపెట్టారు.పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి ఇస్రో పంపనుంది.
RISAT1 అని కూడా పిలిచే EOS-04 కాకుండా మరో రెండు చిన్న ఉపగ్రహాలను కూడా పోలార్ శాటిలైట్ వెహికల్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. INS-2TD అనేది భారతదేశం-భూటాన్ జాయింట్ శాటిలైట్ (INS-2B)కి పూర్వగామి.
వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై ఉండే తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమే EOS-04 అని ఇస్రో తెలిపింది.
లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ ద్వారా ప్రారంభానికి అప్రూవల్ దక్కిన అనంతరం ఈ ప్రయోగానికి 25 గంటల పాటు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని ఇస్రో వెల్లడించింది.

Leave a Reply