కరెంటు చార్జీలు తగ్గించి, ధాన్యం కొనండి

– సీఎం కేసీఆర్‌కు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ లేఖ

తెలంగాణలో సామాన్యుడిని హడలెత్తిస్తున్న విద్యుత్ చార్జీలు తగ్గించడంతోపాటు, రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

నమస్కారం …
విషయం: రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించడంతోపాటు యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ…..

విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పేరిట మోయలేని భారం మోపడం బాధాకరం. విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ మిగులు రాష్ట్రమైతే ప్రజల నడ్డి విరిచి రాష్ట్ర ఖజానా నింపుకునే చర్యలు ఏమాత్రం క్షమించరానిది. పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు ఉపసమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం యెక్క దివాళా కోరు ఆర్ధిక విధానాలు, క్రమశిక్షణ రాహిత్యం వలన రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. గత ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకు కరెంట్ కోనుగోలు చేసి అవినీతికి పాల్పడటం వలన రాష్ట్ర ప్రజలపై విపరీతమైన చార్జీల భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 50 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించకపోవడం వలన డిస్కంలు అప్పులు ఊభిలో కూరుకుపోయాయి. వీటిని సాకుగా చూపి పేద, మధ్యతరగి ప్రజలపై అధిక చార్జీలు మోపడం దారుణం. మీ స్వార్ధ ప్రయెజనాల వలన రాష్ట్ర అర్ధిక పరిస్థితి దివాళ తీసిందనే వాస్తవాన్ని తోక్కిపెట్టడానికి, మీ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని తరువాత ఒక దానిపై రేట్లు పెంచుకుంటూ పోవడం అన్యాయం. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపు అందులో భాగమే.

కరెంట్ ఛార్జీల పెంపువల్ల అత్యధికంగా పేదలపైనే భారం పడుతోంది. చెల్లించే స్థోమత ఉన్న వర్గాల మీదనే చార్జీల భారం ఉంటుందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇఫుడు నిరుపేద కుటుంబాలపైనా ఛార్జీల భారం మోపం సహించరానిది. గొప్పల కోసం, కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులకు వడ్డీలు చెల్లించుకోవడానికే చార్జీల పెంచినట్లు కన్పిస్తోంది. మొండి బకాయిలు, దొంగ కనెక్షన్లతో ఇష్టమొచ్చినట్టు కరెంటు వాడి బిల్లులు ఎగ్గొట్టే వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూసీ చూడనట్టే వ్యవహరించడమే కాకుండా వారు వాడే కరెంటు చార్జీలను కూడా సామాన్యులపైనే మోపడం క్షమించరాని విషయం.

పాతబస్తీలో కుప్పలు తెప్పలుగా దొంగ కనెక్షన్లు కనిపిస్తాయి. పాతబస్తీలు కరెంట్ బిల్లులను వసూలు చేయలేని ప్రభుత్వ అసమర్ధత వల్ల తెలంగాణలో విద్యుత్ సరఫరా తాలూకు సాంకేతికి వాణిజ్య నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన కరెంట్ ఛార్జీలను కూడా డిస్కంలకు చెల్లించకపోవడం అన్యాయం. ప్రభుత్వ శాఖలకు చెందిన కరెంట్ బిల్లుల బకాయిలే రూ.12,598 కోట్లు ఉన్నాయి. విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన రాయితీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా డిస్కంలను దివాళా తీయిస్తుండటం బాధాకరం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒనుగోలు ఒప్పందాలలో చాలా లొసుగులున్నాయి ఆంధ్రప్రదేశ్‌ వద్దనుకున్న సంస్థలతో, ఏపీ ప్రభుత్వం చేసుకున్న ధరల కంటే అదిక ధరలకు తెలంగాణ విద్యుత్‌ కొనడం విస్మయం కలిగిస్తోంది. దీనివల్ల ప్రతి ఏటా ప్రజలపైన రూ.వేల కోట్ల భారం పడుతోంది. ప్రజల మీద విద్యుత్ చార్జీలు పెంచాలనే ఆలోచన ముందు నుండే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే బడ్జెట్ లో విద్యుత్ శాఖకు కేటాయించాల్సిన నిధుల పూర్తిస్థాయిలో కేటాయించలేదు. ఈ సమస్య నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ధాన్యం కొనుగోళ్ళ పేరుతో మీ పార్టీ నేతలు నానాయాగీ చేస్తున్నారు.

కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా రారైస్‌ సప్లయ్‌ చేయమని కేంద్రం అడుగుతోంది. రారైస్‌ సప్లయ్‌ పై మీరు కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని మరుగున పరచి మీరు వేస్తున్న వీధి నాటకాలను తెలంగాణ రైతు సోదరులు, విజ్ఞులైన ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ఐ.కె.పి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి రారైస్‌ సప్లయ్‌ చేసేందుకు చర్యలు తీసుకోండి.

గత సంవత్సరం యాసంగి, వర్షాకాల పంటల నుండి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కోటా జాప్యంపై ఇటీవల ఎఫ్‌.సి.ఐ అధికారులు చేసిన తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. సుమారు 1.81 లక్షల క్వింటాళ్ళ వడ్లు రైస్‌ మిల్లుల్లో మాయం అయినట్లు గుర్తించారు. ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్‌ మెంట్‌కు ఎఫ్‌.సి.ఐ అధికారులు ఇచ్చారు. రాష్ట్రంలో మిల్లర్ల అరాచకాలకు, అవినీతికి కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లుల్లో మాయమైన 1.81 లక్షల క్వింటాళ్ల వడ్ల అంశంపై విచారణకు ఆదేశించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ముకాస్తూ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుందని భావించాల్సి వస్తుంది. కేంద్రం వైఖరి స్పష్టంగా ఉన్నా ధాన్యం కొనాలంటూ స్థానిక సంస్థల చేత ప్రత్యేక తీర్మానాలు చేయిస్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల వల్ల 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది రాష్ట్ర ప్రజలపై భారం కాదా?

అభినందనలతో …
– రాజాసింగ్‌,
బిజెపి శాసనసభాపక్ష నాయకులు

Leave a Reply