– అప్పుడు గన్మెన్ల సంగతి కేసులో ఎక్కడ?
– హత్యకుముందు కాల్డేటా, టవర్ లొకేషన్ వివరాలేవీ?
– కోర్టులో హతుడి తల్లి పిటిషన్
– ఏబీ రాకతో సిట్ వేసిన సర్కారు
రాజమండ్రి: జగన్ జమానాలో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగడంతో మళ్లీ విచారణ మొదటికివచ్చింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి విచారణ కోరుతూ ప్రాసిక్యూషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ హత్య చేసిన క్రమంలో మరికొందరి సాయం తీసుకున్నాడని వారి వివరాలు తేల్చాల్సి ఉందని, ప్రాసిక్యూషన్ పేర్కొన్నారు.
హత్యకు ముందు కాల్ డేటా, టవర్ లొకేషన్ ఏవీ గతంలో పోలీసులు విచారించ లేదని మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. ఎమెల్సీ అనంతబాబు తన కొడుకును హత్య చేసినప్పుడు గన్మెన్లు ఏరన్న విషయాన్ని దర్యాప్తులో విస్మరించారని అభ్యంతరం తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కేసును తదుపరి విచారణ చేసేలా అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ కోర్టులో పిటిషన్ వేశారు.
2022 మే 19న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి..ఈ హత్యను తానే చేశానని స్వయంగా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించడంతో, అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే మధ్యంతర బెయిల్పై విడుదలైన అనంతబాబు రెండేళ్లు బయట తిరుగుతున్నారు.
తాజాగా డ్రైవర్ హత్య కేసు పునర్విచారణకు కాకికాడ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందు కోసం విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
60 రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన నివేదికను డీజీపీ, ఎస్పీకి ఇవ్వాలని దేవరాజ్ను ఆదేశించారు. అలాగే ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం కోరింది.
వారికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును కూడా నియమించారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగి, డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబాన్ని పరామర్శించి, వారి పక్షాన తాను పోరాటం చేస్తానని ప్రకటించారు. చార్జిషీట్లోని లోపాలను ఆయన ఎత్తిచూపారు. దానితో కదిలిన సర్కారు.. ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేసి, దానిపై సిట్ వేస్తున్నట్లు ప్రకటించింది.