– కేబినెట్ నిర్ణయం లేకుంటే అప్పుడు ఎందుకు చెక్కులు ఇచ్చినట్లు?
– మహిళ సంఘాలకు రెండు సార్లు ఆవే చెక్కులు ఇచ్చినా ఇప్పటికి చెల్లుబాటు కాలేదు.
– ఈసారైనా చెక్కులు క్లియర్ అవుతాయా?
– 18 నెలలు గడుస్తున్నా పీఆర్సి ఊసే లేదు
– 6 నెలల తర్వాత డిఏ ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు
– ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు
– కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు అసహనం
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేబినెట్ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, పంచ పాండవులు ఎంత మంది అంటే మంచం కోళ్లలాగ ముచ్చటగా ఇద్దరు అని ఒక వేలు చూపించినట్లు ఉంది.
ప్రభుత్వం లో ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 డిఏ లను తక్షణం చెల్లిస్తాం అని అభయహస్తం మేనిఫెస్టో లో నమ్మ బలికి 5 డిఏ పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు ఉసూరు మంటూ ఒక్క డిఏ రిలీజ్ చేశారు.
ఇదేనా డిఏ లు సకాలం లో ప్రకటించడం, బకాయిలను నేరుగా చెల్లించడం అంటే రేవంత్ రెడ్డి? అధికారం లో వచ్చిన 6 నెలల్లో పీఆర్సి ఏర్పాటు అని మభ్య పెట్టి, 18 నెలలు గడుస్తున్నా ఊసే లేదు. ఆరు నెలల తరువాత ఇంకో డిఏ అని చెప్పడం విడ్డూరం. జనవరి, జూలై నెలలో సంవత్సరానికి రెండు డిఏ లు ఉద్యోగస్తులకు ఇస్తారు. 2025 జనవరి డిఏ కేంద్రం మార్చి లో ప్రకటించారు. జూలై నెల డిఏ ను సెప్టెంబర్ లో కేందం ప్రకటించే అవకాశం ఉంది. అటువంటి అప్పుడు 6 నెలల తర్వాత డిఏ ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ స్కీము
జీఓ ను ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరం. పిఆర్సి ప్రస్తావన లేదు, పెండింగ్ బకాయిలు ప్రస్తావన లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన లేదు. ఇవేవీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని మరోసారి నిరూపితమైంది. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పినట్లు పెండింగ్ డి ఏ లు అన్ని తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రెండు సార్లు ఇచ్చిన చెక్కులపై మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం హాస్యాస్పదం?
అంటే గతంలో రెండు సార్లు మీరు పంపిణీ చేసిన చెక్కులకు విలువ లేదా ముఖ్యమంత్రి గారు? కేబినెట్ నిర్ణయం లేకుంటే అప్పుడు ఎందుకు చెక్కులు ఇచ్చినట్లు? నవంబర్ 19, 2024 నాడు వరంగల్ లో స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందించారు.
మళ్ళీ అవే చెక్కులను మార్చి 8, 2025 నాడు ఇందిరా మహిళా శక్తి పేరిట హైదరాబాద్ లో నిర్వహించిన సభలో సీఎం అందించారు. స్వయంగా ముఖ్యమంత్రి మహిళ సంఘాలకు రెండు సార్లు ఆవే చెక్కులు ఇచ్చినా ఇప్పటికి చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు మరోసారి క్యాబినెట్ నిర్ణయం అంటూ మాటలు చెబుతున్నారు? ఇంకెన్ని సార్లు చెక్కులు, నిర్ణయాలు.. ఈసారైనా చెక్కులు క్లియర్ అవుతాయా?