– మల్లు భట్టి విక్రమార్క ప్రశంసల వర్షం
అమ్రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఒక వజ్రం లాంటి వారని, ఆయన హృదయంలోంచి వచ్చిన ఆలోచనే ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవని, వజ్రం లాంటి ఆయన మనసులోంచి ఈ పథకం పుట్టిందని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమి కోసం ఈ గడ్డపై ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.
నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇదొక గొప్ప కార్యక్రమం. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల నినాదాలను ఈ ప్రభుత్వం చట్టంగా మారుస్తోంది. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వామిని కావడం నా జన్మ ధన్యమైంది అన్నారు.
ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలి. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయి. వారికి కేవలం భూములే కాకుండా, వాటిని సాగు యోగ్యం చేసుకునేందుకు అవసరమైన నిధులను కూడా అందిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు చేస్తుంది. నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని భట్టి వివరించారు.
గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని భట్టి తెలిపారు. ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అనవసర విమర్శలను కుట్రలుగానే పరిగణిస్తామని అన్నారు. సంపదను సృష్టిస్తాం, సృష్టించిన సంపదను పేదలకు పంచుతాం. ఇదే మా నినాదం అని భట్టి తెలిపారు.