నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయి

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే, ఇది కుట్ర అని, వీడియో మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అంటున్నారు. తాను జిమ్ లో ఉన్నప్పటి వీడియోను మార్ఫింగ్ చేసి, తాను ఓ మహిళతో మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ వీడియో టీడీపీ వర్గాలకు బలమైన ఆయుధంలా లభించింది. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆ వీడియో నిజమో కాదో తేలాల్సి ఉందన్నారు. గోరంట్ల ఇష్యూలో ఆయన కంప్లైంట్‌ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దానిపై విచారణ జరుగుతుందన్నారు. మార్ఫింగ్‌ కాదని తేలితే మాధవ్‌పై పార్టీపరంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని హెచ్చరించారు. నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలుంటాయని చెప్పారు.

అది ఫేక్ వీడియో అని మాధవ్ సవాల్ చేసి చెబుతున్నాడని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడని సజ్జల పేర్కొన్నారు. విచారణ అనంతరం వెలువడే అసలు నిజం కోసం వేచిచూస్తున్నామని వెల్లడించారు. ఏదేమైనా ఇది ప్రైవేటు వ్యవహారం కాబట్టి తక్కువగా మాట్లాడాల్సి ఉంటుందని, జగన్ చేతల్లోనే చూపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇలాంటి వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పారు. సభ్య సమాజంలో మహిళల పక్షపాత పార్టీగా వైసీపీకి గుర్తింపు ఉందని, ఆ గుర్తింపునకు తగినట్టుగానే ఈ వ్యవహారంలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Leave a Reply