Suryaa.co.in

National

ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డి కేంద్రాలు ఏర్పాటుచేయండి

– స్విస్ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం భేటీ!
– పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం: మంత్రి లోకేష్

జ్యురిచ్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ్యురిచ్ లోని హిల్డన్ హోటల్ లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏడునెలల క్రితం ఏర్పాటైన ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా పారిశ్రామిక ప్రోత్సహకాలు అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని, 1053 కి.మీ.ల సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. మరో ఏడాదిన్నరలో భోగాపురం, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డి కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్ స్ట్రుమెంట్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి స్విస్ పరిశోధన సంస్థలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో స్టార్టప్ లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో స్విస్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఎపి యువతలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని కోరారు. పూణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్‌లు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్, స్విస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ జనరల్ రావోల్ కెల్లర్, ఒర్లికాన్ సీఈవో మార్కస్ టకే, యాంగిస్ట్ ఫిస్టర్ సీఈవో ఎరిక్ షెమిద్, స్విస్ టెక్స్ టైల్స్ ఎకనమిక్ అండ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ హెడ్ బోజర్న్ వాండర్ క్రోన్, హెచ్ ఎస్ బిసి సీఈవో స్టీవెన్ క్లెన్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE