మతం ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్దుడు. ఆన్ లైన్ సంస్థను ఏర్పాటు చేసి.. ప్రార్థనల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అతనితో పాటు.. సంస్థ నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.తెలంగాణలోని కోదాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు పడింది. న్యాయం జరిగేవరకు అండగా ఉంటానని భాదితులకు భరోసా ఇచ్చిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత.
మతం ముసుగులో సంస్థను ఏర్పాటుచేసి ఆన్లైన్ ప్రార్థనల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాంపురం శివారులో ఎ.అనిల్కుమార్ అలియాస్ ప్రేమదాస్ భారీ భవనం నిర్మించి మత సంస్థ పేరుతో ఆశ్రమం నడుపుతున్నాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పి మహిళలపై వల విసురుతున్నాడు. వారితో వెట్టిచాకిరి చేయించడంతోపాటు ప్రేమదాస్ లైంగికంగా వేధించేవాడు.
అతడి వేధింపులు భరించలేక తెలంగాణలోని కోదాడకి చెందిన ఓ యువతి గురువారం పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఇష్టం లేకున్నా ఓ యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారని, గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారని యువతి ఆరోపించారు. సంస్థ నిర్వాహకుడు నీలి చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐ నారాయణరావు చెప్పారు. ప్రార్థనల కోసం అనిల్కుమార్కు రూ.లక్షల్లో చెల్లించామని కడప, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన 30 మందికిపైగా మహిళలు ఇదే సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఎదిరిస్తే చంపుతామని బెదిరించారని ఆరోపించారు.
నకిలీ పాస్టర్ బాధితులకు అండగా ఉంటాను – వంగలపూడి అనిత
పాయకరావుపేట మండలం, శ్రీరాంపురం గ్రామంలో మతం ముసుగులో అమాయకులైన ఆడపిల్లలను లైంగికంగా వేదిస్తున్న నకిలీ పాస్టర్ లు వేధిస్తున్న విషయం తెలిసి, బాధిత యువతుల్ని కలిసి వారికి భరోసా కల్పించిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.