ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

– కూలిపోయే ప్రభుత్వం అని తెలిసి కూడా కేసీఆర్ ఎగిసి పడుతున్నారు
– కేసీఆర్ కు ముందు నుంచి చిన్న చూపు
– ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్ ఆల్రెడీ రాష్ట్రంలో కల్వకుంట రాజ్యాంగం అమలు చేయడం ప్రారంభించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ కొత్త సెషన్స్ ను ఉభయ సభలు సమావేశ పరిచి, ఆ రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాతనే ప్రారంభం కావాలి. పైగా గవర్నర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగానే ఏ అసెంబ్లీ సెషన్ అయినా కొనసాగాలి. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వ్యవస్థనే కించపరుస్తూ గవర్నర్ ప్రసంగం లేకుండా ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్నారు. ఇది ఆయన నిరంకుష, నియంత స్వభావానికి అద్దం పడుతుంది.

గవర్నర్ డా.తమిళిసై ఒక మహిళ అయినందువల్లనే ఆమె తో అసెంబ్లీ, కౌన్సిల్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించ కూడా చేశారని స్పష్టంగా అర్థం అవుతోంది. మహిళలంటే కేసీఆర్ కు ముందు నుంచి చిన్న చూపు. అవకాశం ఉన్నప్పుడల్లా మహిళలను కేసీఆర్ అవమాన పరుస్తూనే ఉన్నారు. మొదటి సారి రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడ్డప్పుడు ఆ క్యాబినెట్ లో మహిళలకు అవకాశమే ఇవ్వలేదు.

ఇక గవర్నర్ ఒక మహిళ అయినందువల్లనే ప్రతిసారీ సీఎం కేసీఆర్ అవమాన పరుస్తున్నారు.. చివరికి మొన్నటికి మొన్న సమ్మక్క-సారలమ్మ జాతరకు గవర్నర్ వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించనే లేదు. రాష్ట్ర ప్రథమ మహిళ ఒక దేవస్థానికి వెళ్లనప్పుడు అప్పటివరకు అక్కడే ఉన్న మంత్రులు సడెన్ గా మాయం అయ్యారు. మంత్రులెవరూ గవర్నర్ ని ఆహ్వానించలేదు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆయన సొంత రాజ్యం అనుకుంటున్నారు. తనకు ఏది ఇష్టమైతే అదే చేస్తున్నారు. ఆయన చేసే పనులు రాజ్యాంగ విరుద్ధంగానే ఉంటాయి. ఈయన అహంకారాన్ని దించే కాలం దగ్గర పడింది.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కూలిపోయే ప్రభుత్వం అని తెలిసి కూడా కేసీఆర్ ఎగిసి పడుతున్నారు.

Leave a Reply