Suryaa.co.in

Andhra Pradesh

హోదా మీద మొండి పట్టు పట్టాలి

-సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ?
-పోలవరం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి
-మోడీ ప్రధాని అయ్యారు అంటే తెలుగు ఎంపీలే కారణం
-మీకు హనీమూన్ పీరియడ్ లేదు
-జగన్ అన్నకు వ్యతిరేకంగా ఓటు వేశారు
-ప్రత్యేక హోదా మన ఊపిరి
-వైఎస్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు
-8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నాం
-ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్

విజయవాడ: ‘‘ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పవర్ మాత్రం మోడీ దగ్గర లేదు. ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఈ సారి జరిగిన ఎన్నికల్లో చాలా విచిత్రం. ఊహించని ఫలితాలు వచ్చాయి. మార్పు కావాలని ప్రజలు తీసుకున్న నిర్ణయం. ఒకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలు’’ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు.

విజయవాడ పీసీసీ కార్యాలయంలో మాట్లాడిన షర్మిల ఇంకా ఏమన్నారంటే.. జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలు. ఈ సారి ప్రజలు తమ ఓటుకి న్యాయం జరగాలి అనుకున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకునే నిర్ణయం తీసుకుంది. ప్రజల గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈ సారి కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు తీసుకురాలేక పోయింది. ఎన్నికలకు ముందు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నాం.

64 నియోజక వర్గంలో నేను సభల్లో పాల్గొన్న. ప్రజలు ఈ సారి ఒక్క ఓటు కూడా వృధా కావొద్దు అనుకున్నారు. అందుకే జగన్ అన్న మీద వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుంది. 2029 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

చంద్రబాబుకి గుర్తు చేస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది మన ఊపిరి. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. అదే వేదిక మీద 15 ఏళ్లు కావాలని చంద్రబాబు అడిగారు. 10 ఏళ్లలో మోడీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు హోదా సాధించే అవకాశం ఉంది. కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారు అంటే తెలుగు ఎంపీలే కారణం.

ఆంధ్ర రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే మోడీ ప్రధాని అయ్యారు. చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఇచ్చిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉంది. బాబు ఈ విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కేంద్రం వద్ద హోదా మీద బాబు మొండి పట్టు పట్టాలి. హోదా సాధించుకుని రావాలి.

పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. వైఎస్ బ్రతికి ఉంటే ఎప్పుడో పూర్తి అయ్యేది. 2014 లో చంద్రబాబు 29 వేల కోట్లకు అంచనా వ్యయం పెంచారు. 2018 నాటికి పూర్తి చేస్తాం అన్నారు. తర్వాత జగన్ వచ్చి రివర్స్ టెండర్ అన్నారు.

బాబుని డిమాండ్ చేస్తున్నాం. పోలవరం మీద ఒక శ్వేత పత్రం ఇవ్వాలి. మీ హయాంలో ఎంత వరకు పనులు జరిగాయి ? జగన్ హయాంలో జరిగిన నష్టం ఏంటి? 75 శాతం పనులు పూర్తి అయితే…25 శాతం పనులకు 4 ఏళ్లు ఎందుకు పడుతుంది ?

మీ సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? విధి విధానాలు ఏమిటో… ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వండి ? మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల లెక్క కాదు. మన రాష్ట్రం ఒక స్పెషల్ చైల్డ్. మీరు ఇప్పుడే గెలిచారు..ఆ విషయం మాకు తెలుసు. మీకు హనీమూన్ పీరియడ్ లేదు. పనులు వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మక స్థాయిలో పాత్ర పోషిస్తాం.

కడప పరిస్థితి వేరు. కడపలో అధికార పక్షం ఎంపీ ఉన్నాడు… ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. ఓటుకి 3500 పైగా ఇచ్చారు. ఒడిస్తే పథకాలు ఆపుతాం అని బెదిరించారు.ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు. నేను ఎంపీగా గెలవక పోవడం టైం మాత్రమే. నేను 14 రోజులు చాలా కష్ట పడ్డాను. చాలా రూరల్ ప్రాంతాల్లో నేను పోటీ చేస్తున్నట్లు తెలియలేదు. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని మాత్రమే పోటీ చేశా. అది జరగలేదు.. ప్రజల కంటే పైన ఉన్నది దేవుడు. హంతకులను పైన దేవుడు శిక్షిస్తాడు.

ఈవీఎం టాంపరింగ్ అనేది దేశానికి సంబంధించిన నిర్ణయం. అందరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో వైఎస్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్ ఒక మహానాయకుడు. ఆయన విగ్రహాలు ధ్వంసం చేయడం దారుణం. వైఎస్ఆర్ చనిపోతే రాష్ట్రంలో 700 మంది చనిపోయారు. ధ్వంసం చేసే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. చనిపోయిన వాళ్లకు గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు.

పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ ఉంటుంది..పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే సీట్ల పంపిణీ. చిల్లర ఆరోపణలు నేను పట్టించుకోలేదు. వాళ్ళ మీద పార్టీ తరుపున కఠిన చర్యలు తీసుకుంటాం.

రాహుల్ ఒక ఫైటర్. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు. కాంగ్రెస్ కి పెద్దపీట వేశారు. రాహుల్ పాదయాత్ర న్యాయం కోసం,ఐక్యత కోసం చేసిన పోరాటం. ఎంతోమంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగింది. రాహుల్ కష్టం వల్ల ఎంతో లాభం కలిగింది. ప్రతి కార్యకర్త ను గర్వంగా నిలబెట్టాడు. రాహుల్ కి మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నాం.

రాహుల్ దెబ్బకు బీజేపీ చతికల పడింది. ఇండియా బ్లాక్ మంచి ఫలితాలను చూపింది. బీజేపీ ఒక మతతత్వ పార్టీ. మణిపూర్ ఘటన ద్వారా బీజేపీ అరాచకాలు దేశం మొత్తం తెలిశాయి. బీజేపీ అరాచక పాలన వల్ల భారీగా మెజారిటీ తగ్గింది. కొద్దిగా ఇండియా బ్లాక్ కష్టపడి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారు.

LEAVE A RESPONSE