డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌పై సర్వే

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: విజయవాడ గుండా వెళ్ళే రెండు డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లకు సంబంధించి సర్వే, డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) రూపొందించే పనులు పురోగతిలో ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఖర్గపూర్‌ నుంచి విజయవాడ (1115 కి.మీ)కు ప్రతిపాదించిన ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌, విజయవాడ-ఇటార్సీ (975 కి.మీ) మధ్య ప్రతిపాదించిన నార్త్‌ సౌత్‌ సబ్‌ కారిడార్‌కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదని అన్నారు. సర్వే, డీపీఆర్‌ పూర్తయిన తర్వాత సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాల ప్రాతిపదికపై మాత్రమే ఏ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌నైనా మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Leave a Reply