– పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయతీ
– అయోమయంలో పోలీసులు
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరింది. ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా సుమలత, రమ్య అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. వీరు కొద్దిరోజులుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
వారిలో రమ్య తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. తన కుమార్తెను ట్రాప్ చేశారని.. వీరిద్దరు వివాహం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను తనకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు యువతలతో పాటూ ఆమె తల్లిని పిలిపించి మాట్లాడారు.
రమ్య మాత్రం సుమలతతో కలిసి ఉంటానని తేల్చి చెప్పారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని.. తాము అసలు పెళ్లి చేసుకోలేదు అంటున్నారు. తాను ఇక్కడే ఉండి చదువుకుంటానంటున్నారు. తామిద్దరం ఇద్దరం అక్కా చెల్లెలా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. రమ్యకి మేనమామతో ఆమె తల్లి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో తన దగ్గర ఉంటోందని సుమలత అంటున్నారు.
తాము కేవలం టిక్ టాక్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు నటించామని సుమలత చెప్పుకొచ్చారు. ఆ వీడియోలు చూసి నిజంగానే పెళ్లి చేసుకున్నట్లు ఏదో క్రియేట్ చేశారంటున్నారు. తనను రమ్య తల్లి రూ.10లక్షలు డిమాండ్ చేశారని ఆరోపిస్తోంది. దీనిపై సుమలత ఇంట్లో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది.
ఇద్దరు యువతుల వివాహంపై తాను మందలించడంతో తనను వారి ఇంటి పనుల నుంచి తొలగిస్తామని చెప్పారని అంటోంది. ఈ వివాదంతో ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు.