Suryaa.co.in

Andhra Pradesh

ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే టీడీపీ నేత చౌదరి దారుణ హత్య

– కత్తులతో దాడి చేసిన దుండగులు
– ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి
– తమ ప్రభుత్వంలోనే దాడి జరగడంపై కార్యకర్తల కన్నెర్ర
– సీఎం బాబు, మంత్రి లోకేష్ ఖండన
– హుటాహుటిన ఆసుపత్రికి మంత్రి గొట్టిపాటి
– పార్టీనేతల ఆత్మస్థైర్యం దెబ్బతీసిన ఘటన

ఒంగోలు: అది ఒంగోలు ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరం. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మేనల్లుడు, నాగలుప్పాడు మండల టీడీపీ నేత ముప్పవరపు వీరయ్యచౌదరి ఆఫీసు ఉంది. అక్కడే దుండగులు ఆయనపై తెగబడి కత్తులతో స్వైరవిహారం చేశారు. శరీరమంతా రక్తంతో నిండిపోయిన చౌదరిని, అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన మృతి చెందారు.

టీడీపీకి కంచుకోటగా పేరున్న ప్రకాశం జిల్లాలో చాలా ఏళ్ల తర్వాత జరిగిన దారుణ హత్య ఇది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే.. తమ పార్టీ నేత హత్యకు గురికావడంపై, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి ప్రాంగణం కార్యకర్త ఆగ్రహజ్వాలతో ఉద్రిక్తతతో నిండిఉంది. నిందితులను అరెస్టు చేయాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసుల వైఫల్యాన్ని టీడీపీ నేతలు తూర్పారపడుతున్నారు.

ఈ ఘటనను సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌తోపాటు జిల్లా జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు ఖండించి, చౌదరి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి గొట్టిపాటి రవి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లగా, హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి సంఘటనా వివరాలు సేకరించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని హత్య చేశారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిపై గుర్తు తెలియని దుండగులు అటాక్ చేశారు. కత్తులతో పొడిచారు. అగంతకుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
టీడీపీ నేత హత్యపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్య చౌదరి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్‌కి తరలించారు. టీడీపీ నేత హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యపై హోంమంత్రి అనిత స్పందించారు. వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. వీరయ్యను చంపిన నిందితులను తక్షణమే పెట్టుకోవాలని ఆదేశించారు.

హోంమంత్రి ఆదేశాలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునేందుకు వేట సాగిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్యపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగంతో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి మాట్లాడుతున్నారు.

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.

దెబ్బతిన్న కార్యకర్తల ఆత్మస్థైర్యం
తాజాగా జరిగిన చౌదరి హత్య టీడీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినేందుకు కారణమయింది. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పార్టీ మండల స్థాయి నేతను హత్య చేయడం వల్ల, కింది స్థాయి కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి నేత ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులతో నిరంతరం పోరాడే తమ సంగతేమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారంటున్నారు.

LEAVE A RESPONSE