ఆవుల తరలింపును అడ్డుకున్న చిత్తూరు టీడీపీ నేతలు

పలమనేరులోని టిటిడి గోశాల నుంచి అక్రమంగా ఆవులను తరలిస్తున్నారంటూ టిడిపి నాయకులు అడ్డుకున్నారు. గోశాల నుంచి ఒంగోలుకు తరలిస్తున్న ఆవులను రైతుల పేరుతో అక్రమంగా తరలిస్తున్నారని మాజీమంత్రి అమరనాథ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ దాతలు ఇచ్చిన ఆవులను అక్రమంగా తరలించి టిటిడి గోశాలను ఇక్కడ లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు.ప్రకృతి వ్యవసాయానికి రైతులకు ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్న టిటిడి అధికారులు కనీసం రైతుకు సెంటు భూమి లేకున్నా ఎవరో పేరు తో ఉన్న పాస్ బుక్ జిరాక్స్ పెట్టి తరలిస్తున్నారని ఆరోపించారు.

గత ప్రభుత్వహయాంలో సుమారు 500 ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకోవడం దారుణమన్నారు.ప్రజలు, భక్తులు టిటిడి గోశాల కోసం కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు అందిస్తున్నా గోసాలలోని పశువులను తరలించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు.సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుట్టపై పాలు పోసిన గోమాతను పోషించే స్తోమత లేక, రైతుల పేరుతో కబేళాలకు తరలించే చర్యలు మానుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply