– కేసు ఏసీబీ కోర్టు పరిథిలోకి రాదన్న న్యాయాధికారి
– ఎఫ్ఐఆర్లో కసిరెడ్డి రాజ్ పేరు లేదు కదా
– సీఐడీ కేసులో హాజరుపరచండని ఆదేశం
– దానితో వాదనలకు తాత్కాలిక బ్రేక్
అమరావతి: లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి కేసులో కోర్టులో వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. తొలుత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరుచగా, వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున కళ్యాణి వాదనలు వినిపించారు.
మద్యం పాలసీ పేరుతో అవినీతికి పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని వాదించారు. నెలకు రూ. 60 కోట్లు కసిరెడ్టి ద్వారా డబ్బులు చేతులు మారాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం రాజ్ డిక్టేట్ చేశారన్నారు. అవినీతి, మనీ లాండరింగ్కు పాల్పడ్డారని వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో కసిరెడ్డి రాజ్ పేరు లేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ.. ఏసీబీ కోర్టులో ఈ కేసును ఎందుకు వేశారని న్యాయాధికారి ప్రశ్నించారు. 17a ఈ కేసులో ఎలా వర్తిందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. సీఐడి కేసు కూడా ఉన్నందున సీఐడీ కోర్టులో ఈ కేసు వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
కసిరెడ్డి రాజ్ తరఫున వాదనలు వినిపిం చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. రాజ్ కసిరెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడుగా ఉన్నారని, ఆయనకు నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు అసలు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదన్నారు. రాజకీయ కారణాలతోనే కసిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. పిసి యాక్ట్ ఈ కేసులో అసలు అమలు కాదని వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని అభిప్రాయపడ్డారు. మెమో వెనక్కి ఇస్తామని.. సిఐడి కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి సూచించారు. ఇందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో.. వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది.